సాయి తేజ్ సినిమా బాధ్యతను భుజాన వేసుకోనున్న మెగా ఫ్యామిలీ..?


మెగా మేనల్లుడు సాయి తేజ్ – ‘ప్రస్థానం’ ఫేమ్ దేవకట్టా కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ ”రిపబ్లిక్”. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా తన సినిమాకు ప్రమోషన్స్ చేసుకోలేని పరిస్థితిలో సాయి తేజ్ ఉన్నారు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త పెరుగుపడి స్పృహలోనే ఉన్నప్పటికీ.. మరికొద్ది రోజులు హాస్పిటల్ లోనే ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ పరిస్థితుల్లో మెగా హీరో తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాయి తేజ్ కి అండగా నిలబడటానికి మిగతా మెగా ఫ్యామిలీ హీరోలందరూ రెడీ అవుతున్నారని సమాచారం.

సాయి తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతను మెగా హీరోలు భుజాన వేసుకుంటున్నారని తెలుస్తోంది. వీరందరూ రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. మామూలుగానే మెగా ఫ్యామిలీలో హీరోలందరూ ఏదొక విధంగా ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈసారి సాయి తేజ్ యాక్సిడెంట్ కు గురై ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి మరింత బాధ్యత తీసుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

కాగా ‘రిపబ్లిక్’ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ పంజా అభిరామ్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నారు. తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. ఇందులో రమ్యకృష్ణ – జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ – టీజర్ – పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్’ మంచి విజయం సాధించి సాయి తేజ్ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.