యూపీలో సైకిల్ పంచాయితీ

ఎన్నికలకు రెడీ అయిన ఉత్తరప్రదేశ్ లో సైకిల్ పంచాయితీ మొదలైంది. ఏపీలో టీడీపీకి సైకిల్ గుర్తు ఉన్నట్లే ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ గుర్తు కూడా సైకిలే. ఇప్పుడు అక్కడ సైకిల్ ఎవరిదనే పోరు షురూ అయింది.

తండ్రిని బేఖాతరు చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేష్.. పార్టీ గుర్తుపై కూడా కన్నేశాడు. దీంతో సైకిల్ ను కాపాడుకోవడానికి ములాయం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పార్టీ చేజారిపోయిందని, కనీసం గుర్తైనా మిగిల్చుకోవాలనేది ములాయం తాపత్రయం.

సమాజ్ వాదీ పార్టీ తనదేనన్న ములాయం. ఆ పార్టీ గుర్తు సైకిల్ కూడా తమతోనే ఉంటుందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు మతిస్థిమితం లేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు చెప్పారు.

అయితే ఇంటి సమస్యలు పరిష్కరించలేకపోతున్న ములాయం.. పార్టీని ఏం గెలిపిస్తారని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. అటు యూపీలో ఎన్నికల విజయం కోసం ములాయం కుటుంబ నాటకానికి తెరతీశారని కమలనాథులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏదేమైనా రేపు ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏ గుర్తుతో పోటీచేస్తారనేది తేలాల్సి ఉంది.