మళ్లీ అధికారంలోకి వస్తామనే కలలో బతకొద్దంటూ టీడీపీపై నాగబాబు ఫైర్

మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు టీడీపీని టార్గెట్ చేశారు. ఈరోజు తన ట్విట్టర్ అకౌంట్లో తనదైన స్టైల్లో టీడీపీపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణలా మారిపోయాయి పరిస్థితులు. ఈ నేపథ్యంలో మొన్న చిరంజీవిని మిగిలిన నటులను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. బాలకృష్ణపై మాటల యుద్ధం చేస్తూ మధ్యలో టీడీపీపై వ్యంగ్యాస్త్రాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా టీడీపీనే డైరక్ట్ గా టార్గెట్ చేస్తూ పంచ్ లు వేశారు.

‘2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తన అభిప్రాయం చెప్పారు. ఏపీలో 2024లో వైసీపీ వస్తుందా.. జనసేన వస్తుందా.. బీజేపీ వస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ.. టీడీపీ మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి రాదనే నా అభిప్రాయం అంటూ’ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. గత టీడీపీ హయాంలో ప్రజలకు టీడీపీ వల్ల ఒరిగిందేమీ లేదని.. వాళ్లకు అనుకూలమైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అభివృద్ధి జరిగిపోతోందంటూ గ్రాఫిక్స్ లో చూపించుకున్నారు అంటూ దుయ్యబట్టారు. నిజానికి గ్రౌండ్ లెవల్లో జరిగింది తక్కువ అన్నారు. వారి హయాంలో అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ.. గురించి ప్రస్తావించి ఇలాంటి వాటి గురించి రాసుకుంటూ పోతే గ్రంధాలు అవుతాయని ట్విట్టర్ సరిపోదని వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు.

గత ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడంతో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గ్రహించాలని అన్నారు. అయినా కూడా.. తర్వాత మేమే వస్తాం.. మాదే రాజ్యం అంటూ కలల్లో బతికేస్తే టీడీపీకి ప్రయోజనం లేదు. వాస్తవంలోకి రావాలంటూ హితవు పలికారు. లేదూ.. మేము ఇలాంటి కలల్లోనే బతికేస్తామంటే వారికి స్వాగతం చెప్తున్ననంటూ ఎద్దేవా చేశారు. మానసిక శాస్త్రంలో అలాంటి వాటిని హాల్యుజినేషన్స్ అంటారని.. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హాల్యూజినేషన్స్’ అంటూ ముగింపునిచ్చారు.