కరోనా సోకిన టీవీ నటి.. బహు చక్కగా చెప్పింది

కరోనా సోకిందా.. ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఉంటోంది జనాల మైండ్ సెట్. కానీ మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండి.. ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పాటిస్తూ.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటూ.. అవసరమైన మందులు వేసుకుంటే రెండు వారాల్లో తిరిగి మామూలు మనిషి కావడం కష్టమేమీ కాదని చాలామంది విషయంలో రుజువవుతోంది.

ఈ విషయంలో జనాల్లో అవగాహన పెంచడానికి సెలబ్రెటీలు బాగాే కృషి చేస్తున్నారు. ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి తాను కరోనా బారిన పడ్డప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఎలా దాన్నుంచి బయటపడ్డానో వివరించింది. ఇప్పుడు టీవీ నటి నవ్య స్వామి కూడా కరోనా బాధితురాలిగా తేలిన సంగతి తెలిసిందే. ఆమె వెంటనే ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన అభిమానుల కంగారు తగ్గిస్తూ.. జనాలకు మంచి సందేశం ఇచ్చింది.

తాను కరోనా బారిన పడ్డ మాట వాస్తవమే అన్న నవ్య.. వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు చెప్పింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆసుపత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకపోయిందని.. ఇంట్లోనే ఉంటూ వైద్యుల సలహాల మేరకు నడుచుకుంటున్నట్లు ఆమె చెప్పింది. తనతో గత కొన్ని రోజుల్లో క్లోజ్‌గా ఉన్న అందరికీ విషయం చెప్పి వాళ్లను కూడా టెస్ట్ చేయించుకోమని చెప్పినట్లు ఆమె వెల్లడించింది.

కరోనా గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారని.. వాటిని అస్సలు పట్టించుకోవద్దని.. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఫుడ్ తీసుకుంటూ, అవసరమైన మందులు వేసుకుంటూ వెళ్తే, జాగ్రత్తలు పాటిస్తే ఏమీ కాదని.. తాను అదే చేసి త్వరలోనే కోలుకుంటానని ఆమె చెప్పింది. తన గురించి ఆందోళన చెందిన వాళ్లకు ధన్యవాదాలు చెప్పిన నవ్య.. కరోనా సమయంలో నెగెటివిటీకి దూరంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యమైన విషయం అని విలువైన సూచన చేసింది.