బ్రేకింగ్: అనారోగ్యంతో నాయిని నర్సింహారెడ్డి భార్య మృతి..

తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఈనెల 22న మృతి చెందిన సంగతి తెలిసిందే. నాయిని మృతినే జీర్ణించుకోలేని ఆయన కుటుంబం ఇప్పుడు మరో విషాదంలో కూరుకుపోయింది. నాయిని భార్య అహల్య కాసేపటి క్రితం మరణించారు. అనారోగ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేవలం.. వారంలోపు వ్యవధిలో వీరిద్దరూ మృతి చెందడం నాయిని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇటివల నాయినికి నిమోనియా సోకడంతో అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆ సమయంలోనే ఆయన భార్యకు కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చింది. అయితే.. ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

నరసింహారెడ్డి మృతి చెందిన సమయంలో కూడా ఆయన భార్యను ఆంబులెన్స్ లోనే వీల్ చైర్ లోనే తీసుకొచ్చి భర్త చివరి చూపు చూపించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అనారోగ్యానికి తోడు.. మనోవేదన కూడా ఆమె మరణానికి కారణమైందంటూ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.