బెల్లంకొండ శ్రీనివాస్ని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని బెల్లంకొండ సురేష్ ఇప్పటికే చాలా కోట్లు ఇన్వెస్ట్ చేసాడు. వినాయక్, బోయపాటి లాంటి దర్శకులకి పదేసి కోట్లు ఇచ్చి, హీరోయిన్లపై కోటాను కోట్లు గుమ్మరించి తనయుడిని స్టార్ని చేయాలనే సంకల్పంలో మిగతా అందరినీ మించిపోయాడు బెల్లంకొండ.
ఆయన తపన ఫలించి ఇప్పుడు శ్రీనివాస్ని ఇండస్ట్రీ కూడా హీరోగా గుర్తిస్తోంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాలతో వరుసగా బ్లాక్బస్టర్స్ సాధించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్తో చేస్తున్నాడు. బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రానికి ‘మంత్రిగారి అల్లుడు’ అనే పేరు పరిశీలనలో వుందని సమాచారం.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాస్ చేస్తోన్న ‘అల్లుడు బంగారం’ జులైలో విడుదల కానుంది. త్రినాధరావుకి కమర్షియల్ పల్స్ బాగా తెలుసని ఇప్పటికే రెండుసార్లు రుజువైంది కనుక ఈ ప్రాజెక్ట్తో శ్రీనివాస్ నక్క తోక తొక్కినట్టే. పైగా బయటి నిర్మాత కావడం వల్ల పెట్టుబడి రిస్కు బెల్లంకొండకి వుండదు.