శ్రీదేవికి ఆ మాత్రం తీరిక లేదా?

దర్శకరత్న దాసరి నారాయణరావును ఒక తెలుగు దర్శకుడిగా మాత్రమే పరిగణిస్తే అది పొరబాటే అవుతుంది. మొత్తం భారతీయ సినీ చరిత్రలోనే దాసరిది ప్రత్యేకమైన స్థానం. ఆయన బాలీవుడ్ వాళ్లూ గౌరవిస్తారు. కోలీవుడ్ వాళ్లూ గౌరవిస్తారు. ఆయన బాలీవుడ్లోనూ విజయ పతాకాన్ని ఎగుర వేశారు. తమిళులనూ ఆకట్టుకున్నారు. అందుకే రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు కూడా దాసరి చనిపోయినట్లు తెలియగానే స్పందించారు.

ఆయనపై తమ గౌరవాన్ని చాటుకున్నారు. కొందరు బాలీవుడ్ ఫిలిం మేకర్స్, క్రిటిక్స్ కూడా దాసరికి సోషల్ మీడియాలో నివాళి అర్పించారు. కానీ మన అతిలోక సుందరి శ్రీదేవికి మాత్రం దాసరి గురించి ఒక్క మాట మాట్లాడే తీరిక దొరకలేదు.

శ్రీదేవిని అందలం ఎక్కించింది.. ఆమెకు హీరోయిన్‌గా ఒక స్థానం సాధించి పెట్టింది తెలుగు సినిమానే. ఇక్కడే ఆమె బాల నటిగా.. ఆపై కథానాయిగా ఎదిగింది. ఇక్కడొచ్చిన గుర్తింపుతోనే బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడా అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులో శ్రీదేవి ఎదుగుదలకు కారణమైన దర్శకుల్లో దాసరిది కీలక పాత్ర. ఆయన దర్శకత్వంలో బొబ్బిలి పులి, ప్రేమాభిషేకం, కృష్ణార్జునులు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి. దాసరి మరణంపై నేషనల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.

సోషల్ మీడియాలో కూడా నేషనల్ లెవెల్లో దాసరి పేరు ట్రెండ్ అయింది. నిన్న జాతీయ స్థాయిలో ఇంతకంటే పెద్ద వార్తలేమీ లేవు. మరి దాసరి చనిపోయిన సంగతి శ్రీదేవికి తెలియకుండానే ఉంటుందా? ఆమెకు ఆయన గురించి ఒక ట్వీట్ పెట్టే తీరిక లేదా? నిన్నా మొన్నా ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉందా అంటే అదీ లేదు. వచ్చే వారం విడుదల కానున్న తన 300వ సినిమా ‘మామ్’ గురించి ట్వీట్లు.. రీట్వీట్లు చేస్తూ కూర్చుందామె.

తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ.. తనకు లైఫ్ ఇచ్చిన దాసరి మరణం గురించి స్పందించడంలో లేదు. ఇప్పటికే ‘బాహుబలి’ని కాదని తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న శ్రీదేవిపై ఇది మరింత వ్యతిరేకత పెంచేదే.