‘ఖైదీ నంబర్ 150’ విడుదలైన తర్వాత మరో ఘనమైన ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేసారు. గుంటూరులో విడుదలకి ముందు చేసినట్టుగానే విడుదలైన తర్వాత విశాఖలో థాంక్స్ మీట్ పెట్టాలని అనుకున్నారు. ఈ కారణంగానే విడుదలైన తర్వాత పెట్టిన ప్రెస్మీట్స్కి చిరంజీవి అటెండ్ అవలేదు.
సినిమా కలక్షన్లు అనౌన్స్ చేద్దామనుకున్న నిర్మాత రామ్ చరణ్ కూడా డ్రాప్ అయి అల్లు అరవింద్ని పంపించాడు. అయితే వంద కోట్ల షేర్ వసూలు చేసి దాదాపుగా బిజినెస్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చాక కూడా థాంక్స్ మీట్ గురించిన ఊసే లేదు. సినిమా థియేటర్లలో వుండగా ఇలాంటి ఈవెంట్లు చేయడం వల్ల ఎక్స్ట్రా మైలేజ్ వుంటుంది కానీ రన్ పూర్తయిన తర్వాత థాంక్స్ మీట్లు ఘనంగా చేసుకోవడం వల్ల ఉపయోగమేంటి?
గతంలో అంటే వంద రోజులు, నూట డెబ్బయ్ అయిదు రోజులు అంటూ మైల్స్టోన్లని సెలబ్రేట్ చేసుకునే వారు కానీ ఇప్పుడు థియేటర్లలో వుండగా చేసే పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విడుదలకి ముందు గుంటూరులో చేసిన ఈవెంట్ కంటే ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత చిరంజీవికి వచ్చే రెస్పాన్స్ పీక్స్లో వుండేది. మరి కాస్త లేట్ అయినా ఈ వేడుకని చరణ్ చేస్తాడా లేక మొత్తంగా డ్రాప్ అయ్యాడా?