అతణ్ని అడిగింది ఎన్టీఆరే.

‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతుండటం పక్కా. దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. ఓవైపు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. మరోవైపు ప్రశాంత్ నీల్.. ఈ సినిమా గురించి ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు.

ఐతే ప్రశాంత్‌-ఎన్టీఆర్ సినిమాకు ప్రతిపాదించింది ఎవరు.. ఈ సినిమా ఎలా సెట్టయింది అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ప్రశాంతే ఎన్టీఆర్‌తో పని చేయడానికి ఆసక్తి చూపించాడని కొందరు.. మైత్రీ వాళ్లు ప్రశాంత్‌ను అడిగి తారక్‌తో సినిమాకు ఒప్పించారని ఇంకొందరు అంటున్నారు.

కానీ ప్రశాంత్‌తో సినిమా చేయాలని ఆసక్తి చూపించి అతణ్ని లైన్లోకి తీసుకుంది ఎన్టీఆరేనట. ఈ విషయాన్ని మైత్రీ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘కేజీఎఫ్’ సినిమా చూసి ఎన్టీఆర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యారని.. ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారని.. అతణ్ని అడగమని తమకు అతనే సూచించాడని నవీన్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాము సంప్రదింపులు జరిపాక ఎన్టీఆర్‌తో సినిమాకు ప్రశాంత్ కూడా ఎంతో సంతోషంగా అంగీకరించాడని.. ఐతే ఈ కాంబినేషన్లో సినిమాకు కథా చర్చలు ఇంకా జరగలేదని ఆయన స్పష్టం చేశాడు.

ప్రశాంత్ ఇంకా ఎన్టీఆర్‌కు కథ చెప్పాల్సి ఉందని అతనన్నాడు. అంటే ‘కేజీఎఫ్’లో ప్రశాంత్ పనితనం చూసి ఎన్టీఆర్ ఎంతగానో ఇంప్రెస్ అయిపోయి కథ కూడా వినకుండానే అతడితో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడన్నమాట.

యశ్ అనే మీడియం రేంజి హీరోను పెట్టుకుని.. అసలతను పరిచయం లేని వాళ్లకు కూడా గూస్ బంప్స్ ఇచ్చాడంటే.. ఇంకేం కావాలని ఎన్టీఆర్ భావించి ఉండవచ్చు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ప్రశాంత్ ఇంకెంత బాగా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి మరి. వీరి కలయికలో వచ్చే ఏడాది సినిమా పట్టాలెక్కే అవకాశముంది.