సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ పోటీ చూసేసాం. ఇద్దరూ హిట్లు కొట్టినా కానీ ఖైదీ నంబర్ 150తో చిరంజీవి భారీ ప్రభంజనాన్నే సృష్టించారు. ఈ ఏడాదిలో మరోసారి మెగా వర్సెస్ నందమూరి పోటీ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పవన్కళ్యాణ్ తదుపరి చిత్రం, ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ రెండూ ఒకే డేట్కి ఎయిమ్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ ‘జై లవకుశ’, పవన్-త్రివిక్రమ్ల చిత్రం ఆగస్ట్ 11ని టార్గెట్ చేస్తున్నాయి.
ఈ రెండు చిత్రాలు ఇంకా మొదలు కాకపోయినా కానీ ఎన్టీఆర్ చిత్రం ముందుగా సెట్స్ మీదకి వెళ్లనుంది. త్రివిక్రమ్తో పవన్ సినిమా మొదలయ్యేది ఎప్పుడనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ దానిని నాలుగు నెలల్లో పూర్తి చేసి ఆగస్టు 11కి రెడీ చేస్తానని త్రివిక్రమ్ అంటున్నాడట. తన దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉండడంతో షూటింగ్ వేగంగా పూర్తి చేయడం కష్టం కాదనేది త్రివిక్రమ్ నమ్మకం. మరోవైపు జై లవకుశకి కూడా జులై రెండోవారానికి పూర్తయ్యేలా షెడ్యూల్ వేసుకున్నారు.
మరి ఈ రెండిట్లో ఏ చిత్రం అనుకున్న తేదీకి వస్తుందనేది తెలియదు కానీ, రెండూ రెడీ అయితే మాత్రం మెగా-నందమూరి పోరు అత్యంత రసవత్తరంగా ఉంటుంది. కాకపోతే సంక్రాంతికంటే రెండు భారీ చిత్రాలు తట్టుకున్నాయి కానీ, ఆగస్టులో వస్తే ఈ లెవల్ రిసెప్షన్ కష్టమే మరి.