రఘురామ కృష్ణంరాజు మాట.. పవన్ కళ్యాణ్ సీఎం అయితే #pawan kalyan

కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్‌గా మారిన సంగతి సంగతి తెలిసిందే. ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఎదురు లేకుండా సాగపోతున్న వైకాపాకు ఈయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ మీదే కాక పలువురు వైకాపా నేతల మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరిని మరీ పూచికపుల్లలా తీసిపడేశారు. ఈ విమర్శలకు గాను షోకాజ్ నోటీసు ఇస్తే.. దాని మీదా కౌంటర్లతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారాయన. కాస్త ముందో వెనుకో ఆయన వైకాపాకు గుడ్ బై చెప్పడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.

సొంత పార్టీ మీద విమర్శల జోరు కొంచెం తగ్గించిన రఘురామ కృష్ణంరాజు.. తాజాగా ప్రతి పక్ష పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ అత్యంత నిజాయితీ పరుడని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే.. ఏపీ ఐదేళ్ల వ్యవధిలోనే ఇండియాలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుందని రఘురామ అన్నారు.

అంతే కాక.. పవన్ లాంటి నిజాయితీ పరుడిని ఓడించిన ప్రజలకు న్యాయం మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్‌కు రఘురామ ఇచ్చిన ఈ ఎలివేషన్లు జనసైనికులకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఐతే వైకాపాను వీడి భాజపాలో చేరేలా కనిపిస్తున్న రఘురామ.. ఆ పార్టీతో కలిసి సాగుతున్న జనసేన అధినేతను పొగడ్డంలో ఆశ్చర్యమేముందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.