పవన్‌ మలయాళం రీమేక్‌ టైటిల్‌ హింట్ ఇచ్చారు

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘అయ్యప్పన్‌ కోషియమ్’ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు దాదాపు ఏడాది క్రితం రీమేక్‌ రైట్స్‌ తీసుకుని టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో రీమేక్‌ చేయాలని భావించారు. మల్టీస్టారర్‌ కాన్సెప్ట్‌ అవ్వడంతో సినిమాకు పలువురు హీరోలు నో చెప్పారు. చివరకు పవన్‌ కళ్యాణ్‌ ఓకే చెప్పాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు నిన్న దసరా సందర్బంగా ఈ సినిమాను అధికారికంగా పవన్‌ హీరోగా ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ తో పాటు ఈ సినిమాలో మరో హీరోగా రానా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాకు టైటిల్‌ గా ‘బిల్లా రంగా’ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయ్యప్పన్‌ కోషియమ్‌ సినిమా కథానుసారంగా ఇద్దరి మద్య సాగే ఆసక్తికర కథ. అందుకే బిల్లా మరియు రంగాల మద్య ఆ కథ సాగినట్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దాంతో ఖచ్చితంగా ఒక మంచి తెలుగు నేటివిటీ ఫీల్‌ వస్తుందనే అభిప్రాయంను సినీ వర్గాల వారు వ్యక్తం చేశారు. అందుకే బిల్లా రంగాను అనుకుంటున్నారు. 1982లో చిరంజీవి మోహన్‌ బాబులు కలిసి నటించిన సినిమా బిల్లా రంగా టైటిల్‌ తో వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు మళ్లీ బిల్లా రంగా టైటిల్‌ ను పవన్‌ మూవీ కోసం సితార వారు రీ రిజిస్ట్రర్‌ చేయించారు అనే టాక్‌ వస్తుంది. నిన్న విడుదలైన సినిమా అధికారిక ప్రకటన వీడియోలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ లో బిల్లా రంగా అన్నట్లుగా వినిపిస్తుంది. కనుక సినిమాకు అదే టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు. బిల్లా రంగా సినిమాను మంచు మనోజ్ మరియు సాయి ధరమ్‌ తేజ్‌ లు రీమేక్‌ చేయాలనుకున్నారు. ఈలోపే పవన్‌ చేసేయబోతున్నాడు. కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది పవన్‌ చేయబోతున్న సినిమాలకు ఇది అదనం.