తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన విశాఖలోని ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీ ఎపిసోడ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వినూత్న రీతిలో స్పందించారు. అనుమతి లేదనే పేరుతో పోలీసులు నిరసనను భగ్నం చేయడమే కాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. పద్యం రూపంలో తన అభిప్రాయాలు పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్లో “ఈరోజు అరెస్టు కాబడి విడుదలైన జనసేన కార్యకర్తలకు, ప్రజలు, విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలను. మీరు క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నారు. శేషేంద్రగారి పద్యం తొలి మజిలిలో సేద తీరుస్తుందని నమ్ముతున్నాను”
అంటూ పద్యం పోస్ట్ చేశారు. “రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోకబాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు అసలే ముళ్లు కదలనీకుండా చేస్తే ధరగమనమంతటితో తలకిందులైపోతుందా? పాలకుల కూటమికొక త్రుటికాలం జయమొస్తే విశ్వ స్రుష్టి పరిణామం విచ్చిన్నం అవుతుందా? ధనుజ లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే..నరజాతి ప్రస్థానం పరిసమాప్తవుతుందా?” అంటూ పద్యం ట్వీట్ చేశారు
ఇదిలాఉండగా తన ట్వీట్లో అరెస్టయిన వారందరినీ ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరును మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.