ఐరన్ లెగ్ అంటూ స్టార్ హీరోయిన్ పై ట్రోల్స్..!

తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించిన పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇప్పుడు అమ్మడికి తెలుగులో తిరుగులేదని చెప్పొచ్చు. తొలినాళ్లలో హిందీలో పరాజయంతో పలకరించిన పూజా కు.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే తనని హీరోయిన్ ని చేసిన ఇండస్ట్రీలో మాత్రం ఈ బ్యూటీ నిలదొక్కుకోలేకపోతోంది.

పదేళ్ల తర్వాత ”బీస్ట్” సినిమాతో పూజా హెగ్డే కోలీవుడ్ లో అడుగుపెట్టింది. విజయ్ వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ రావడంతో.. తమిళనాట అమ్మడి టైం స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. పూజా కూడా అలానే భావించిందేమో ఫుల్ బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా డేట్స్ కేటాయించింది. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేసుకుంది. అయితే కన్నడ కస్తూరికి ఈసారి కూడా నిరాశే ఎదురైంది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బీస్ట్’ సినిమా ప్లాప్ అవడంతో పూజా ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. విజయ్ స్టార్ డమ్ వల్ల ఓపెనింగ్ డే వసూళ్లకు డోకా లేకుండా పోయింది. కానీ నెగెటివ్ టాక్ వల్ల రెండో రోజు నుంచి డ్రాప్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా పరాజయానికి పూజా హెగ్డే నే కారణమన్నట్లు తలపతి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

పదేళ్ల కెరీర్ లో తమిళ్ లో చేసిన రెండు సినిమాలూ ప్లాప్ అవడంతో పూజా హెగ్డే ని ఐరన్ లెగ్ అంటూ విమర్శిస్తున్నారు. వరుస విజయాలతో దూకుడుమీదున్న విజయ్ కు బ్రేక్ పడేలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు తమిళ తంబీలు. దీనికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు.

ప్రభాస్ – పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన ‘రాధేశ్యామ్’ సినిమా డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్లింగ్ ఫ్యాన్స్ ‘బీస్ట్’ అభిమానులకు వంత పాడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు మాత్రం పూజా కి సపోర్ట్ గా నిలుస్తూ వాళ్ళకి కౌంటర్లు ఇస్తున్నారు. బన్నీ తో కలిసి ‘డీజే’ ‘అల వైకుంఠపురములో’ వంటి రెండు హిట్స్ అందుకుంది పూజా.

ఏదేమైనా టాలీవుడ్ తో పోల్చుకుంటే కోలీవుడ్ లో సెంటిమెంట్లు మరీ ఎక్కువ అనే చెప్పాలి. ఒక్కసారి ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్రపడిన తర్వాత సినిమాల్లోకి తీసుకోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఇప్పుడు పూజా రెండు ప్లాప్స్ మూటగట్టుకుంది. ‘రాధేశ్యామ్’ కూడా తమిళ్ లో ప్రభావం చూపలేకపోయింది. దీంతో తమిళనాట ఈ బ్యూటీ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.

అయితే తెలుగులో మాత్రం పూజా హవా కొనసాగుతూనే ఉంది. ఆమె కీలక పాత్ర పోషించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న విడుదల అవుతోంది. అలానే మే 27న రిలీజ్ కాబోతోన్న ‘ఎఫ్ 3’ మూవీలో స్పెషల్ పార్టీ సాంగ్ లో మెరవనుంది. ప్రస్తుతం ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ లో పూజా పాల్గొంటోంది. చివరిగా ఆమె ‘రంగస్థలం’ లో ‘జిగేల్ రాణి’ అనే ఐటమ్ సాంగ్ లో ఆడిపాడింది.

ఇకపోతే మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రానున్న ‘SSMB28’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అలానే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలిసి చేస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో నటించనుంది. ఇక నాగచైతన్య – వెంకట్ ప్రభు కలయికలో రాబోయే సినిమాలోనూ పూజా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.