ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లిన ప్రభాస్..తర్వాతేమైంది?

ఎంత పెద్ద స్టార్ కావొచ్చు. మరెంత ప్రముఖుడు కావొచ్చు. రూల్ ప్రకారం కొన్నిసార్లు తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లక తప్పని పరిస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే డార్లింగ్ ప్రభాస్ కు ఎదురైంది. కరోనా వేళ.. స్టార్ హీరోలు ఎవరు బయటకు అడుగు పెట్టని పరిస్థితి. ఇందుకు భిన్నంగా ప్రభాస్ మాత్రం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు.

ఇటీవల ఆయన కొన్న కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. నిబంధనల ప్రకారం కారు యజమాని ఎవరైనా తప్పనిసరిగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ఈ-సంతకం పెట్టాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కు ధరించిన కార్యాలయానికి వచ్చారు. తమ ఆఫీసుకు వచ్చింది ప్రభాస్ అన్న విషయం తెలిసిన వెంటనే.. ఆర్టీఏ అధికారులు ఆయన్నుచూసేందుకు.. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

ప్రభాస్ వచ్చారన్న విషయం తెలిసిన అక్కడికి వచ్చిన వారు ఆఫీసు ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో.. అక్కడి సందడి వాతావరణం నెలకొంది. కాకుంటే.. ఈ హడావుడికి ప్రభాస్ మాత్రం కాస్త ఇబ్బందికి గురైనట్లు చెబుతున్నారు. తనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిన అందరితోనూ ఓపిగ్గా ఫోటోలు దిగి వెనుదిరిగారు.