ప్రభాస్‌ వంటి సూపర్‌ స్టార్‌ తో రీమేక్‌ ఏంటి బాసూ?

కేజీఎఫ్‌ నిర్మాణ సంస్థ మరో భారీ ప్రాజెక్ట్‌ ను రేపు ప్రకటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా తెలియజేసింది. తమ పాన్‌ ఇండియా మూవీని ప్రకటించబోతున్నట్లుగా హంబుల్‌ నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా పోస్ట్ తో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ సినిమా చేయబోతున్నది మరెవ్వరో కాదు ప్రభాస్‌ మరియు ప్రశాంత్‌ నీల్‌ అంటున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ కన్నడ మీడియాతో పాటు జాతీయ మీడియా కోడై కూస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ ఉన్న బిజీకి ప్రశాంత్‌ నీల్‌ కు రెండేళ్ల వరకు డేట్లు ఇచ్చే అవకాశం లేదు. అయినా కూడా ప్రశాంత్‌ నీల్‌ తదుపరి సినిమాను ప్రభాస్‌ తోనే చేయాలనుకుంటున్నాడేమో అంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ సమయంలోనే ప్రభాస్‌ తో ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్న సినిమా ఆరు ఏళ్ల క్రితం వచ్చిన ‘ఉగ్రమ్‌’ కు రీమేక్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. హిందీ మరియు తెలుగులో ఒకే సారి ఈ సినిమాను రీమేక్‌ చేయాలని ప్రశాంత్ నీల్‌ భావిస్తున్నాడు. ప్రశాంత్‌ కెరీర్‌ ఆరంభంలో ఉగ్రమ్‌ ను చేశాడు. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా అయిదు రెట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టింది. సెన్షేషనల్‌ మూవీగా నిలిచిన ఉగ్రమ్‌ సినిమా హిందీ మరియు తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుందనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు.

ప్రభాస్‌ వంటి సూపర్‌ స్టార్‌ తో రీమేక్‌ ఏంటో అంటూ అభిమానులు కొందరు పెదవి విరిస్తుంటే మరి కొందరు మాత్రం ఇది నమ్మశక్యంగా లేదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది రేపు మద్యాహ్నం రెండు గంటలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్‌ మరియు ప్రశాంత్‌ నీల్‌ లు కలిసి ఉగ్రమ్‌ రీమేక్‌ చేస్తామంటూ మాత్రం విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంత్‌ నీల్‌ మరీ రిస్క్‌ తీసుకోకుండా సింపుల్‌ గా రీమేక్‌ తో ప్రభాస్‌ ను మెప్పించినట్లుగా సమాచారం అందుతోంది.