రెండు నెలల క్రితమే.. లేడీ డాక్టర్ తో ప్రభుదేవాకు రెండో పెళ్లి..!

భారతీయ సినీ పరిశ్రమలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డ్యాన్సర్ ప్రభుదేవా. డ్యాన్స్ డైరక్టర్ గానే కాకుండా దర్శకుడిగా తెలుగు, హిందీలో పలు హిట్ సినిమాలు అందించాడు కూడా. ప్రస్తుతం ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకున్నాడన్న వార్త సినీ సర్కిల్స్ లో కొన్ని రోజులుగా జోరుగా షికారు చేస్తోంది. తనకు వరుసకు మరదలయ్యే శోభను పెళ్లి చేసుకున్నాడనే వార్త వైరల్ అయింది. దీనిపై క్లారిటీ రాకముందే మరో వార్త బయటకు వచ్చింది.

ప్రభుదేవాకు సెప్టెంబర్ లోనే రెండో వివాహం అయిందని.. ఆమె శోభ కాదని బీహార్ కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ అని తెలుస్తోంది. ప్రభుదేవా ఆమధ్య వెన్నునొప్పితో బాధ పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె వద్ద వైద్యం తీసుకున్న ప్రభుదేవా ఆమెతో ప్రేమలో పడ్డాడని అంటున్నారు. కొన్నాళ్లు డేటింగ్ అనంతరం సెప్టెంబర్ పెళ్లి చేసుకుని ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త తమిళ సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుదేవాకు అత్యంత దగ్గరి వ్యక్తులే ఈ విషయం తెలియజేశారని అంటున్నారు.

నయనతారతో ప్రేమ సందర్భంగా ప్రభుదేవా ప్రేమించి పెళ్లి చేసుకున్న రమాలత్ కు 2012లో విడాకులు ఇచ్చాడు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే.. వీరిద్దరికి బ్రేకప్ అయిపోయింది. అప్పటినుంచీ ప్రభుదేవా సింగిల్ గానే ఉంటున్నాడు. ప్రస్తుతం వైరల్ అయిన తన రెండో పెళ్లి వార్తపై ప్రభుదేవా ఇంకా స్పందించలేదు. ఇందులో నిజాలేంటో ఆయనే చెప్పాల్సి ఉంది.