రాజకీయాలపై మరోమారు క్లారిటీ ఇచ్చిన ఎర్రన్న

టాలీవుడ్‌ లో ఎంతో మంది సినీ ప్రముఖులు ఉన్నారు. వారందరిలోకి విభిన్నమైన వ్యక్తి ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ఆర్‌ నారాయణ మూర్తి పేరు మొదటగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో విప్లవ కథాంశాలతో సినిమాలు తీసిన ఈయన్ను అభిమానులు ఎర్రన్న అంటూ పిలుచుకుంటూ ఉంటారు. కమర్షియల్‌ సినిమాల్లో కోట్ల ఆఫర్‌ ఇచ్చి నటించమన్నా కూడా నటించేందుకు ఒప్పుకోని విలక్షణ మనిషి. ఇన్నాళ్లు సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా ఆర్థికంగా అప్పటిలాగే ఇప్పటికి ఉన్నాడు. చాలా సాదారణమైన జీవితాన్ని గడిపే నారాయణ మూర్తి ఇటీవల ఆయన తన స్వస్థలంలో పర్యటించారు.

ఈ సందర్బంగా ఆయన రాజకీయాల గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. స్థానిక మీడియా ఆయన్నతో మాట్లాడిన సమయంలో రాజకీయాలపై స్పష్టత ఇచ్చాడు. గతంలో నాలుగు సార్లు నాకు కాకినాడ ఎంపీ టికెట్‌ ను ఆఫర్‌ చేశారు. రాజశేఖర్‌ రెడ్డి గారు తుని ఎమ్మెల్యే టికెట్‌ ను ఆఫర్‌ చేశారు. నాకు ఎప్పుడు రాజకీయాలపై ఆసక్తి లేదు.

మరో నాలుగు సినిమాలు తీసి డబ్బులు సంపాదించి దేశం మొత్తం తిరగాలనేది కోరిక. ఆ తర్వాత ఒక ఇల్లు కట్టుకుని శేష జీవితంను అక్కడే గడిపేయాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూనివర్శిటీ అనే సినిమాకు సంబంధించిన పనులు చేస్తున్నాను. త్వరలో కరోనా ఉదృతి తగ్గిన తర్వాత షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లుగా చెప్పారు. కరోనా కారణంగా గ్రామానికి వెళ్లినా కూడా తల్లి వద్దకు వెళ్లకుండా దూరంగా ఉండి మాట్లాడి వచ్చారు.