రాజమౌళి-ఆర్ఆర్ఆర్..ఒకటే టెన్షన్

సినిమా షూటింగ్ ల విషయంలో టాలీవుడ్ లో నానా హడావుడి జరుగుతోంది. ఇవ్వాళ ప్రభుత్వం అనుమతి ఇస్తే, రేపటి నుంచి సినిమా షూట్ స్టార్ట్ చేసేంత రేంజ్ లో వుంది హడావుడి. కానీ నిజానికి ఇప్పట్లో షూటింగ్ లు స్టార్ట్ చేసే ఆలోచన నూటికి తొంభై శాతం మంది నిర్మాతలకు లేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నిర్మాతలు భయపడుతున్నారు. షూట్ టైమ్ లో ఎవరికైనా కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు ఖర్చు పెట్టుకుంటారు? అని టెన్షన్ పడుతున్నారు. అందుకే ఓ నెల ఆగి అంటే ఆగస్టు నుంచి షూటింగ్ లకు వెళ్తే బెటర్ అనుకుంటున్నారు. కానీ అర్జెంట్ గా రేపటి నుంచి షూటింగ్ లు చేసేయాలన్నంత తొందరలో ఏ నిర్మాత లేరు.

దర్శకుడు రాజమౌళి మాత్రమే షూటింగ్ ల గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. జూన్ 1 నుంచి షూటింగ్ ప్రారంభం కాకపోతే ఆర్ఆర్ఆర్ విడుదల చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం వుంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. 2021 సమ్మర్ కు అయినా విడుదల చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. సినిమా ఫైనాన్స్ మీద వడ్డీలు పెరుగుతాయి. సినిమా మీద ఆసక్తి తగ్గే ప్రమాదం వుంది. అన్నింటికి మించి ఇద్దరు హీరోలు ఇప్పటికే ఏమీ అనలేక, మౌనంగా వాచ్ చేసే పరిస్థితుల్లో వున్నారు.

మాంచి ఏజ్ లో, మాంచి హిట్ లైన్ లో వున్నపుడు ఎన్టీఆర్ కు మూడేళ్లు మిస్ అయిపోయాయి ఈ ఒక్క సినిమా కోసం. అలాగే రామ్ చరణ్ కు. పైగా రామ్ చరణ్ కు స్వంత సినిమా ఆచార్య అలా ఆగిపోయింది. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వెయింటింగ్ లో వుండిపోయాల్సి వస్తోంది.

ఇప్పుడు అన్ని సినిమాలు ఒకేసారి ప్రారంభం అయితే డేట్ ల సమస్య వస్తుంది. అదే కనుక ఆర్ఆర్ఆర్ ముందుగా ప్రారంభం అయితే ఏ విధమైన అడ్డంకులు వుండవు. ఏవ్వరి డేట్ లు సమస్య కాదు. అందుకే మిగిలిన సినిమాలు జూలై నుంచో ఆగస్టు నుంచో షూటింగ్ లు మొదలుపెట్టే ఆలోచనలో వుంటే ఆర్ఆర్ఆర్ షూట్ ను జూన్ ఫస్ట్ వీక్ నుంచే మొదలు పెట్టాలని తొందర పడుతున్నారు.

సినిమా ఆలస్యం అయిన కొద్దీ, హీరోలతో సమస్యలు, షూటింగ్ బడ్జెట్, మార్కెటింగ్ ఇలా అనేక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం వుందని టెన్షన్ పడుతున్నారు. రాజమౌళి ఎంత తొందరగా సినిమా ఫినిష్ చేస్తే తమకు మంచిది అని త్రివిక్రమ్, కొరటాల శివ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ ముగ్గురు దర్వకులే లీడ్ తీసకుని షూట్ లకు అనుమతి కోసం మీటింగ్ ల మీద మీటింగ్ లు పెడుతున్నారు.