సాహోరే పాటలో వాళ్లను గమనించారా?

అర నిమిషమే నిడివి ఉన్న సాహోరే బాహుబలి.. సాంగ్ టీజర్ నిన్న సాయంత్రం నుంచి ప్రకంపనలు రేపుతోంది. ఇందులో ప్రభాస్ ఏనుగు మీదికెక్కి దాని తొండంతో విల్లు పట్టించి బాణం వదిలే షాట్ హైలైట్ గా నిలిచింది. ఇంకా ఇందులో హీరోయిజం ఎలివేట్ అయ్యే మరిన్ని షాట్లు అభిమానుల్ని మురిపించాయి.

ఐతే ఇందులో ఎవ్వరూ గుర్తించని మరో విశేషం కూడా ఉంది. బాహుబలి సింహాసనం మీద కూర్చుంటే తన మీద జనాలు పూలు చల్లే షాట్ ఒకటి గమనించే ఉంటారు. అందులో కనిపించే అమ్మాయిలు.. అబ్బాయిలు బాహుబలి యూనిట్ సభ్యులకు చెందిన పిల్లలే కావడం విశేషం.

ఆ షాట్లో పూలు చల్లుతూ కనిపించే ముగ్గురమ్మాయిల్లో మొదట ఉన్నది రాజమౌళి-రమల కూతురు మయూఖ. ఆ తర్వాత ఉన్నది రమతో పాటు ‘బాహుబలి’ సినిమాకు స్టైలింగ్ చేసిన ప్రశాంతి కూతురు అనన్య. ఆ పక్కన ఉన్న అమ్మాయి కీరవాణి తనయురాలు కుముద్వతి.

ఇక ఈ అమ్మాయిల ముందు కనిపించే ఇద్దరు చిన్న అబ్బాయిలు ‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కొడుకులు కావడం విశేషం. ‘బాహుబలి’ తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన.. ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో తన కుటుంబ సభ్యులు చాలామందికే భాగస్వామ్యం కల్పించినట్లున్నాడు రాజమౌళి.