మహేష్ సినిమా.. రకుల్ షాకిచ్చిందే

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా మొదలై ఆరు నెలలు దాటింది. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ కూడా బయటికి రాలేదు. ముందు అనుకున్న ప్రకారమైతే ఈపాటికి సినిమా విడుదలకు సిద్ధమైపోయి ఉండాలి. కానీ ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ కూడా బయటికి రాలేదు. షూటింగ్ నిర్విరామంగా జరుగుతూనే ఉంది. కానీ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఆలస్యమైతే అయ్యింది కానీ.. ఇంకో నెలకో రెండు నెలలకో సినిమా పూర్తయిపోతుందిలే అనుకున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాటల్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా పూర్తవడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది.

మహేష్ సినిమాలో తన పాత్ర.. షూటింగ్ ప్రోగ్రెస్ గురించి రకుల్ చెబుతూ ఇప్పటిదాకా తన పాత్ర తాలూకు షూటింగ్ 50 శాతమే పూర్తయిందని తెలిపింది. ఆమె పాత్రకు సంబంధించి ఇంకా 50 శాతం చిత్రీకరణ ఉందంటే సినిమా షూటింగ్ చాలానే పెండింగ్‌ ఉందని అర్థమవుతోంది. ఇప్పటిదాకా లొకేషన్లు మార్చి మార్చి పది షెడ్యూళ్లయినా షూట్ చేసి ఉంటారేమో. రెండు తెలుగు రాష్ట్రాలకు తోడు.. ముంబయి.. అహ్మదాబాద్.. ఇలా ఎన్నెన్నో చోట్ల షూటింగ్ చేశాడు మురుగదాస్. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర్లోని గండికోటలో ఈ చిత్ర షెడ్యూల్ నడుస్తోంది.

అక్కడ మహేష్ మీదే సన్నివేశాలు తీస్తున్నారు. రకుల్ ప్రీత్‌తో ముడిపడ్డ సన్నివేశాల్ని మరో షెడ్యూల్లో తీయనున్నారు. చూస్తుంటే ఏప్రిల్‌కు కానీ ఈ సినిమా పూర్తయ్యేలా లేదు. జూన్ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్. ఈ సినిమా ఆలస్యమవుతుండటంతో కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయాల్సిన చిత్రం కూడా లేటయ్యేలా ఉంది. ఈ ఏడాది దసరాకే అనుకున్న ఆ సినిమాను సంక్రాంతికి షెడ్యూల్ చేసినట్లు తాజా సమాచారం.