సురేందర్.. చరణ్‌ను అంతగా మెప్పించాడా?

రామ్ చరణ్ కెరీర్ సంక్షోభంలో ఉన్న సమయంలో ‘ధృవ’ అతడికి అత్యావశ్యకమైన విజయాన్నందించింది. ఈ సినిమా చరణ్‌కు అనేక రకాలుగా ప్రత్యేకమైంది. చాలా కాలం తర్వాత మాంచి సక్సెస్ కొట్టడమే కాదు.. రొటీన్ సినిమాలు చేస్తాడన్న ముద్ర పోయి చరణ్‌కు ఇమేజ్ పరంగానూ ఒక మేకోవర్ లాగా నిలిచిందీ సినిమా. రీమేకే అయినప్పటికీ ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి బాగా డీల్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. చరణ్ కూడా సురేందర్ వర్క్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు. అందుకే అతడితో మళ్లీ పని చేయాలనుకుంటున్నాడు. ఐతే సురేందర్‌తో చేయబోయే సినిమాకు చరణ్ హీరో కాదు.. నిర్మాత మాత్రమే.

కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా చరణ్ ఓ సినిమా నిర్మించబోతున్నాడట. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో ‘ఖైదీ నెంబర్ 150’తో చరణ్ నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వేరే హీరోలతోనూ సినిమాలు నిర్మించాలని భావిస్తున్న చరణ్.. అఖిల్‌తో ముందుంగా సినిమా చేయబోతున్నాడు. ‘అఖిల్’ లాటి డిజాస్టర్‌తో ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది పూర్తయ్యాక సురేందర్-చరణ్ సినిమాలో నటిస్తాడట. ఈ సినిమా మొదలవడానికి చాలా సమయం ఉండటంతో ఈలోపు స్క్రిప్టు రెడీ చేసుకునే పనిలో పడ్డాడు సురేందర్.