చెర్రీ ట్వీట్.. డిఫెన్స్ లో బాబాయ్

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి 150 సినిమాను గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకెళ్లేందుకు చెర్రీ చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. ఖైదీకి ఎలాంటి నెగిటివ్ టాక్ రాకుండా చూసుకోవటమే కాదు.. మెగా ఫ్యామిలీ అంతా చిరు వెనకనే ఉందన్న విషయాన్ని చెప్పేందుకు చెర్రీ పడుతున్న తాపత్రయం అంతాఇంతా కాదు. ఖైదీ నంబరు 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరు లోని హాయ్ ల్యాండ్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి పవన్ వస్తాడా? రాడా? అన్నది ఇప్పుడు పెద్ద ఉత్కంఠగా మారింది. రావట్లేదని చాలామంది తేల్చేస్తున్న వేళ.. చెర్రీ పోస్ట్ చేసిన ట్వీట్.. ఫంక్షన్ కు పవర్ స్టార్ రాక తప్పని పరిస్థితి కల్పిస్తుందనే చెప్పాలి. పవన్ రాకపోతే ఖైదీ ప్రీరిలీజ్ షో తేలిపోవటం ఖాయమని.. పవన్ వచ్చి.. తన అన్న మీద తనకున్న ప్రేమాభిమానాల్ని కాసింత చెబితే కానీ ప్రిరిలీజ్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కాదన్న ప్రచారం సాగుతోంది.

ఈ అంచనాల సంగతి ఎలా ఉన్నా.. తాజాగా చెర్రీ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాబాయ్ ను తాను కలిసి ప్రిరిలీజ్ ఫంక్షన్ ఇన్విటేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాంచరణ్ చేసిన ట్వీట్ తో.. పవన్ డిఫెన్స్ లో పడినట్లేనా? అన్నది ఒక ప్రశ్న అయితే.. తాజా ట్వీట్ తో పవన్ రాక తప్పని పరిస్థితి ఏర్పడినట్లేనని చెబుతున్నారు. ఇంతకీ.. మెగా ఫంక్షన్ కు పవర్ యాడ్ అయ్యేనా?