హీరోగా కాన్సన్ట్రేట్ చేయమంటూ, వేరే ఆలోచనలు పెట్టుకోవద్దంటూ సురేష్బాబు ఎంత చెప్తున్నా రాణా దగ్గుబాటి వింటున్నట్టు లేడు. నాగ చైతన్య హీరోగా ఒక సినిమా నిర్మిద్దామని రాణా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ని వేరే నిర్మాతకి అప్పగించిన సురేష్బాబు దానికి సమర్పణ బాధ్యతలు మాత్రం తీసుకున్నాడు.
ఘాజీతో సక్సెస్ అయిన రాణాకి బాహుబలి 2 తర్వాత మరింత పేరు వస్తుందని, అంచేత కొంతకాలం నటన మీదే దృష్టి వుంచాలని సురేష్బాబు కోరిక. అయితే మొదట్నుంచీ సినిమా నిర్మాణంపై ఆసక్తి వున్న రాణా తన డాడీ మాట వింటున్నట్టు లేడు. ఎలాగైనా నిర్మాతగా మారి తనకి నచ్చిన సినిమాలు తీయాలని అనుకుంటున్నాడు. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపుతో ఎప్పట్నుంచో రాణా టచ్లో వున్నాడు.
అతని రెండవ చిత్రాన్ని నిర్మించడానికి రాణా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందుకోసం ఒక కార్పొరేట్ సంస్థతోను అతను చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. మరి దీన్నయినా సురేష్బాబు చేయనిస్తారో లేక దీనికి కూడా తనే బాధ్యతలు తీసుకుని రాణాని నటనపై నుంచి ఫోకస్ మార్చవద్దని నచ్చచెప్తారో చూడాలిక.