మెగా ఫ్యామిలీ అతడినే నమ్ముకుంది

సాయిమాధవ్ బుర్రా.. టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ రైటర్ అంటే ఇతనే. విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు రాజమౌళి సినిమాలకే పని చేస్తాడు కాబట్టి.. ఏదైనా చారిత్రక నేపథ్యంతో, సందేశాత్మక కథలతో సినిమాలు తీస్తుంటే స్క్రీన్ ప్లే సహకారం కోసం.. మాటల కోసం ఆశ్రయిస్తున్నది సాయిమాధవ్‌నే.

ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అతడిపై బాగా గురి కుదిరింది. అతడి చేతిలో ఉన్న వేరే ప్రాజెక్టుల్ని పక్కన పెట్టించి మరీ.. తమ సినిమాలకు పని చేయించుకుంటోంది మెగా ఫ్యామిలీ. ఆల్రెడీ ఓకే అయిపోయిన స్క్రిప్టులకు కూడా అతడితో మార్పులు చేయిస్తున్నారు. కొత్తగా డైలాగ్ వెర్షన్ కూడా రాయిస్తున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు.. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’కి ఇలాగే సహకారం తీసుకున్నారు.

తాజాగా చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని కూడా సాయిమాధవ్ చేతిలో పెట్టినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకు పరుచూరి సోదరులు ఎప్పుడో    స్క్రిప్టు రెడీ చేశారు. ఐతే ఇప్పుడు ఈ స్క్రిప్టు సాయిమాధవ్ చేతుల్లో పడింది. ‘ధృవ’కు సహకారం అందించిన వేమారెడ్డి కూడా అతడికి తోడయ్యాడు. వీళ్లిద్దరూ కలిసి ‘ఉయ్యాలవాడ’కు మెరుగులు దిద్దుతున్నారు.

మధు అనే మరో రచయిత కూడా వీరికి సహకారం అందిస్తున్నాడు. డైలాగ్ వెర్షన్ దాదాపుగా సాయిమాధవే రాస్తున్నాడట. ఈ రోజుల్లో జనాల నుంచి కథ కంటే డైలాగులకే ఎక్కువ అప్రిసియేషన్ ఉంటోంది.  ఇంతకుముందు ‘ఖైదీ నెంబర్ 150’ కోసం పరుచూరి సోదరులు ఇలాగే చాలా కష్టపడితే.. చివరికి సాయిమాధవ్ వచ్చి తన డైలాగులతో మేజర్ క్రెడిట్ కొట్టేశాడు. ఇప్పుడు ‘ఉయ్యాలవాడ..’ విషయంలోనూ ఇలాగే జరిగేలా కనిపిస్తోంది.