సాయి సుధా కేసు మరో మలుపు

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో కనిపించిన నటి సాయి సుధ ఇటీవల తనను సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడు పెళ్లి చేసుకుంటాను అంటూ మోసం చేశాడని తనను శారీరకంగా వాడుకుని ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నాడు అంటూ కేసు పెట్టిన విషయం తెల్సిందే. కేసు నమోదు అవ్వడంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే కేసు రాజీ అయ్యింది అంటూ కోర్టుకు తెలియజేసి బయటకు శ్యామ్‌ నాయుడు వచ్చాడు. అయితే రాజీ కుదరలేదని తప్పుడు పత్రాలను శ్యామ్‌ పెట్టాడు అంటూ సాయి సుధా కోర్టుకు తెలియజేయడంతో మళ్లీ ఆయన అరెస్ట్‌ అయ్యాడు.

ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. ఈ సమయంలో సాయి సుధా హఠాత్తుగా ఏసీబీ ఆఫీస్‌ లో ప్రత్యక్ష్యం అయ్యింది. ఆమె తన వద్ద ఎస్‌ఆర్‌ నగర్‌ సీఐ 5 లక్షల లంచం తీసుకున్నాడు అంటూ ఏసీబీకి సాక్ష్యాధారాలతో సహా చెప్పుకొచ్చింది. ఈ సంఘటన ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు పోలీసు శాఖలో చర్చనీయాంశం అయ్యింది. తనకు న్యాయం జరగాలంటే కేసు నమోదు చేయాలంటే లంచం కావాలంటూ డిమాండ్‌ చేశాడు అంటూ సీఐపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది.

లంచం తీసుకుని కూడా తనకు న్యాయం చేయలేదు. అతడికే న్యాయం జరిగేలా సీఐ వ్యవహరించాడు అంటూ ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సాయి సుధ ఇచ్చిన సాక్ష్యాలను వాయిస్‌ రికార్డింగ్‌ లను పరిశీలించిన ఏసీబీ వారు ఆ సీఐ పై కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు శాఖ కూడా అతడిపై శాఖ పరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసు కీలక మలుపు తీసుకోవడంతో ముందు ముందు మరేం జరుగబోతుందో అంటూ ఆసక్తి నెలకొంది.