హోదా దీక్షకు వైజాగ్ కు వచ్చిన ఒకేఒక్క హీరో

హోదా సాధన కోసం ఏపీ యువత నిర్వహిస్తున్న ఆర్కే బీచ్ ఆందోళన లో పాల్గొనేందుకు టాలీవుడ్ కు చెందిన ఒకే ఒక్క హీరో వైజాగ్ కు చేరుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ హీరో.. ఆంధ్రుల ఆకాంక్ష అయిన ఏపీ హోదాకోసం వైజాగ్ కు రావటం ఆసక్తికరమని చెప్పాలి.

వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో నిర్వహిస్తున్న మౌనదీక్షలో తాను పాల్గొంటాననిచెప్పిన సంపూర్ణేష్ బాబు.. చెప్పినట్లుగానే వైజాగ్ కు ఈ ఉదయం చేరుకున్నారు. మరోవైపు.. ఉద్యమ ప్రాంగణమైన ఆర్కే బీచ్ సమీపం లోకి తర్వాత.. ఆ దరిదాపుల్లోకి మీడియాను కూడా అనుమతించకుండా పోలీసులు వ్యవహరిస్తున్న ధోరణిని పలువురు తప్పు పడుతున్నారు.  పోలీసుల తీరు చూస్తుంటే.. కర్ఫ్యూ సమయంలో ఎలాంటి ఆంక్షలు విధిస్తారో.. అలాంటి ఆంక్షల్నే విధిస్తుండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. దీక్ష కోసం వస్తున్న కొద్దిమంది యువకుల్ని పోలీసులు వెనక్కిపంపుతున్నారు. దీక్షలో పాల్గొంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారనిహెచ్చరిస్తూ.. యువకుల్ని వెనక్కి వెళ్లిపోవాలని వారిపై ఒత్తిడి చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. వైజాగ్ లో జరుగుతున్న మౌనదీక్షకు టాలీవుడ్ ప్రముఖులు పలువురు మద్దతు పలికినా.. సంపూర్ణేష్ బాబు ఒక్కరు మాత్రం చెప్పిన మాటకు తగ్గట్లే వైజాగ్ కు రావటం గమనార్హం.