గుండు ఫ‌త్వాకు సింగ‌ర్ షాకింగ్ రియాక్ష‌న్

ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. సెల‌బ్రిటీలు చేసే వ్యాఖ్య‌లు కొన్ని వివాదాస్ప‌దం కావ‌టం.. అవి కాస్తా మ‌త‌ప‌ర‌మైన‌.. రాజ‌కీయ ప‌ర‌మైన అల‌జ‌డికికార‌ణం కావ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కొన్ని విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. హెచ్చ‌రిక‌లు వ‌స్తుంటాయి. తాజాగా అలాంటి హెచ్చ‌రిక‌కు త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయిన సింగర్ ఉదంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ప్ర‌ముఖ సింగ‌ర్ సోనూనిగ‌మ్ ఈ మ‌ధ్య‌న చేసిన కొన్ని ట్వీట్లు సంచ‌ల‌నంగా మారి.. కాసింత వివాదాస్ప‌దంగా మారాయి. త‌న ఇంటి స‌మీపంలోని మ‌సీదు నుంచి వ‌చ్చిన అజాన్ పిలుపుతో నిద్ర లేవాల్సి వ‌చ్చింద‌ని అన‌ట‌మే కాదు.. ఇది గూండాగిరి అంటూ భారీ వ్యాఖ్య‌నే చేశారు. ఇత‌గాడి ట్వీట్‌పై ప‌లువురు ముస్లింలు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డితే.. మ‌రికొంద‌రు మ‌సీదు  సంగ‌తే ఎందుకు.. దేవాల‌యాలు.. చ‌ర్చిల సంగ‌తి ప్ర‌స్తావించ‌వేం అంటూ ప్ర‌శ్నించారు. ఈ వివాదం ఇలా సాగుతున్న వేళ‌.. ప‌శ్చిమ‌బెంగాల్ లోని మైనార్టీ యునైటెడ్ కౌన్సిల్‌కు చెందిన మ‌త‌గురువు మౌలావి ఫ‌త్వా జారీ చేశారు.

సోనూ నిగ‌మ్‌కి గుండు గీయించి మెడ‌లో చెప్పుల దండ వేసి దేశం మొత్తం ఊరేగిస్తే.. రూ.10ల‌క్ష‌ల రివార్డుఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. సోనూనిగ‌మ్ వ్యాఖ్య‌లు త‌ప్పు అయితే త‌ప్పు ప‌ట్టాలి.. విమ‌ర్శించాలే కానీ ఇలాంటి ఫ‌త్వాలు జారీ చేయ‌టం ఏమిట‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై ఊహించ‌ని రీతిలో సోనూ స్పందించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం త‌న ఇంటికి ఆలిమ్ అనే బార్బ‌ర్ వ‌స్తున్నాడ‌ని.. త‌న‌కు గుండు గీయిస్తాడ‌ని చెబుతూ.. “మౌలావి.. మీరు.. రూ.10ల‌క్ష‌లు సిద్ధం చేసుకోవ‌చ్చు” అని ట్వీట్ చేశాడు. అనుకోని రీతిలో రియాక్ట్ అయిన సోనూ ట్వీట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.