మెగా ఫ్యామిలీతో డిజాస్టర్స్‌ బొనాంజా

డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఇప్పుడంటే హ్యాట్రిక్‌ ఫ్లాపులిచ్చాడు కానీ అతని కెరియర్లో హిట్ల శాతమే ఎక్కువ. విశేషం ఏమిటంటే శ్రీను వైట్లకి ఇంతవరకు మెగా ఫ్యామిలీ కలిసి రాలేదు. వెంకీ చిత్రం చూసి ఏరి కోరి శ్రీను వైట్లతో చిరంజీవి ‘అందరివాడు’ చేసారు. అది డిజాస్టర్‌ అయింది. ఆగడు డిజాస్టర్‌ అయిన తర్వాత కూడా రామ్‌ చరణ్‌ అతనితో ‘బ్రూస్‌లీ’ చేసాడు.

ఇందులో చిరంజీవి కూడా అతిథి పాత్ర చేసినప్పటికీ బ్రూస్‌లీ కూడా మెగా ఫ్యామిలీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఫ్రెష్‌గా మరో మెగా హీరోతో శ్రీను వైట్ల ఫ్లాప్‌ ఇచ్చాడు. ఆగడు, బ్రూస్‌లీ ఫలితాలని లెక్క చేయకుండా వైట్లతో చేసిన వరుణ్‌ తేజ్‌కి మర్చిపోలేని గాయంగా మిస్టర్‌ మిగిలింది.

కెరియర్లో చాలా హిట్లు ఇచ్చిన ఒక దర్శకుడు ఒక ఫ్యామిలీతో మాత్రం అసలు సక్సెస్‌ కాకపోవడం విచిత్రమే అనుకోవాలి. మెగా ఫ్యామిలీకి చేదు జ్ఞాపకాలు మిగల్చడం అటుంచితే, శ్రీను వైట్ల కెరియర్‌ ఇప్పుడు ప్రమాదంలో పడింది. హీరోలే కాక నిర్మాతలు కూడా ఇప్పుడు తనతో పని చేయడానికి జంకే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తనే నిర్మాతగా మారి తిరిగి ట్రాక్‌ మీదకి రావడం ఒక్కటే దారి అని ఇండస్ట్రీ జనత అంటోంది.