విజయవాడ పోలీసులకు నటి శ్రీసుధ ఫిర్యాదు

నటి శ్రీ సుధ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును గుద్దిన దుండగులు హత్యాయత్నానికి ఒడిగట్టారని ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె. నాయుడుపై తనకు అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు సహజీవనం చేసి శ్యామ్‌ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనను బెదిరించాడని, దీంతో తనకు అతడి వల్ల ప్రాణహాని ఉందంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌ కేసుకు, విజయవాడ ఘటనకు సంబంధం ఉందంటూ విజయవాడ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషనులో శ్రీసుధ గురువారం ఫిర్యాదు చేశారు. తనను హత్యచేసే క్రమంలో భాగంగానే యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ శ్యామ్‌ కె. నాయుడిపై సందేహం వ్యక్తం చేశారు. ఇక శ్యామ్‌ కె. నాయుడుపై హైదరాబాద్‌లో పెట్టిన కేసు ద‌ర్యాప్తు కోసం ఎస్‌ఆర్‌ నగర్‌ సీఐ ముర‌ళీకృష్ణ త‌న ద‌గ్గ‌ర‌ డ‌బ్బులు వ‌సూలు చేశా‌రని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాక‌ ఈ కేసులో నిందితుడు, త‌న‌తో రాజీ కుదుర్చుకున్న‌ట్లు న‌కిలీ ప‌త్రాలు సృ‌ష్టించార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు నాంప‌ల్లిలోని ఏసీబీ అధికారుల‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.