శ్రీను వైట్ల సూపర్ హిట్ సినిమా సీక్వెల్ పై మరోసారి చర్చ

శ్రీను వైట్ల ఇప్పుడంటే ఫామ్ కోల్పోయి ప్లాప్ డైరెక్టర్ అన్న ముద్ర వేయించుకుని సినిమాలు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు కానీ కెరీర్ టాప్ ఫామ్ లో ఉన్నప్పుడు బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా రచయితల ద్వయం కోన వెంకట్ – గోపి మోహన్ లతో కలిసి శ్రీను వైట్ల ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఈ ముగ్గురూ కలిసి అందించిన మొదటి సూపర్ డూపర్ హిట్ ఢీ. ఈ సినిమా విడుదలకు ముందు చాలా ఇబ్బంది పడింది. బడ్జెట్ పరిమితులకు లోబడి తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయ్యాక హిలేరియస్ ఎంటర్టైనర్ గా పేరు సంపాదించుకుంది.

కొన్నేళ్ల క్రితం ఈ చిత్ర సీక్వెల్ గురించి చర్చ మొదలైంది. అయితే శ్రీను వైట్లకు గోపి మోహన్ – కోన వెంకట్ ద్వయానికి మధ్య మనస్పర్థలు రావడంతో ఎవరికీ వారేగా కొనసాగుతున్నారు. అయితే వీరి నుండి విడిపోయాక శ్రీను వైట్ల పతనం మొదలైంది. వరసగా డిజాస్టర్లు ఇస్తూ వచ్చాడు. అయితే నిన్న ఢీ విడుదలై 13 ఏళ్ళు పూర్తైన సందర్భంగా అందరూ ఈ చిత్రం గురించి శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ గురించి చర్చించుకోవడం జరిగింది.

ఈగోలను పక్కనపెట్టి ఈ ముగ్గురూ కలిసి ఢీ సీక్వెల్ కోసం పనిచేయనున్నారని వార్తలు మొదలయ్యాయి. ట్విట్టర్ లో ఒకరినొకరు ఢీ సినిమా గురించి పొగుడుకోవడం ఈ వార్తలకు బలమిచ్చింది. ప్రస్తుతం ఢీ సీక్వెల్ పట్ల శ్రీను వైట్ల సీరియస్ గా ఉన్నాడని మళ్ళీ తన పాత స్నేహితులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. చూద్దాం మరి అది ఎంత వరకూ నిజమవుతుందో.