సుకుమార్ మళ్లీ లేటే

టాలీవుడ్లో బాగా నెమ్మదిగా తీసే స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒక్కడు. ఆయన స్క్రిప్ట రెడీ చేసుకోవడానికి బాగా టైం తీసుకుంటాడు. మేకింగ్ దశలోనూ అంతే. ప్రతి సన్నివేశం విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి.. రకరకాల వెర్షన్లు రాయించి.. ఫైన్ ట్యూన్ చేయించి.. ఆన్ లొకేషన్ కూడా బెటర్మెంట్లు చేసి.. సినిమాను లేటు చేస్తాడని ఆయనకు పేరుంది.

ఐతే ‘రంగస్థలం’ సినిమా తర్వాత తనపై అంచనాలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈసారి సుకుమార్ స్క్రిప్టు విషయంలో మరీ జాగ్రత్తకు పోయాడని.. దీంతో ‘పుష్ప’ పట్టాలెక్కడానికి బాగా సమయం పట్టేసిందని చిత్ర వర్గాలు చెప్పుకొచ్చాయి. ఐతే అన్నీ పూర్తి చేసుకుని సినిమాను మొదలుపెడదామని చూస్తే కరోనా వచ్చి బ్రేక్ వేసేసింది. ఇక అప్పట్నుంచి ఎప్పుడూ పరిస్థితులు చక్కబడతాయా అని చూస్తున్నారు.

ఐతే కరోనా తీవ్రత మరీ ఏమీ తగ్గిపోకున్నా.. ఇండస్ట్రీలో చాలామంది సెప్టెంబర్లో తమ సినిమాలను మళ్లీ సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసేస్తున్నారు. కొన్ని చిత్రాల బృందాలు ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టేశాయి కూడా. రాధేశ్యామ్, ఆచార్య, బాలయ్య-బోయపాటి మూవీ లాంటి భారీ ప్రాజెక్టులు ఈ నెలలోనే మళ్లీ చిత్రీకరణకు వెళ్లబోతున్నాయి.

కానీ ‘పుష్ప’ టీం మాత్రం ఇప్పుడిప్పుడే కదిలే సూచనలు కనిపించట్లేదని సమాచారం. అనేక పరిమితుల మధ్య, భయం భయంగా షూటింగ్ చేయడానికి ఇటు అల్లు అర్జున్ కానీ, అటు సుకుమార్ కానీ సిద్ధంగా లేరని చిత్ర వర్గాల సమాచారం. కొంత కాలంగా మూత పడి ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ రెండు రోజుల కిందటే తెరుచుకున్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లోనే ‘పుష్ప’ షూటింగ్ మొదలుపెడతారని అనుకున్నారు.

కానీ చిత్ర బృందానికి మాత్రం సుకుమార్ నవంబరులోనే షూటింగ్ అని సమాచారం ఇచ్చాడట. ఆరంభంలోనే కీలకమైన ఎపిసోడ్లు తీయాల్సి ఉండటం, రెండు నెలల పాటు అటవీ ప్రాంతంలో నిర్విరామంగా షూటింగ్ చేయడానికి పక్కాగా షెడ్యూల్స్ వేసుకున్న నేపథ్యంలో ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండొద్దన్నది సుకుమార్-బన్నీ ఉద్దేశంగా కనిపిస్తోంది.