దీపావళికి ఈ సినిమా.. క్రిస్మస్‌కు ఆ సినిమా

కరోనా కారణంగా థియేటర్లు మూతపడి అప్పుడే వంద రోజులు దాటిపోయింది. ఇంకో వంద రోజులకైనా థియేటర్లు తెరుచుకుంటాయా.. మళ్లీ మామూలుగా నడుస్తాయా అన్నది సందేహంగానే ఉంది. ఈ నేపథ్యంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజయిపోతున్నాయి.

తాజాగా హాట్ స్టార్ సంస్థ ‘లక్ష్మీ బాంబ్’; ‘బుజ్’ లాంటి భారీ చిత్రాల ఓటీటీ రిలీజ్‌ను కన్ఫమ్ చేసింది కూడా. ఇది జరిగిన ఒక్క రోజుకే రెండు భారీ బాలీవుడ్ చిత్రాల థియేట్రికల్ రిలీజ్ గురించి ప్రకటన రావడం విశేషం. ఆ చిత్రాలు.. సూర్యవంశీ, 83. ఇందులో సూర్యవంశీ చిత్రాన్ని దీాపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించగా.. ‘83’ని క్రిస్మస్‌కు విడుదల చేస్తారట. ఈ మేరకు ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థలు ప్రకటన ఇచ్చాయి.

ఓవైపు అక్షయ్ నటించిన ‘లక్ష్మీబాంబ్’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంటే.. అతనే నటించిన ‘సూర్యవంశీ’ థియేట్రికల్ రిలీజ్ గురించి ఈ కన్ఫ్యూజింగ్ టైంలో ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మాస్ ఎంటర్టైనర్లకు పేరుపడ్డ రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రమిది. కరణ్ జోహార్ నిర్మాత. ఇందులో అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్ అతిథి పాత్రలు చేశారు. మార్చి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు.

ఆ సినిమాకు అప్పుడున్న బజ్ చూస్తే 300-400 కోట్ల మధ్య కలెక్షన్లు కొల్లగొడుతుందనిపించింది. మరోవైపు రణ్వీర్ కథానాయకుడిగా కబీర్ ఖాన్ రూపొందించిన ‘83’ సినిమాను మే 1నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసుకోక తప్పలేదు. ఈ చిత్రం ఓటీటీల్లో రిలీజవుతుందనే ప్రచారం జరిగింది కానీ.. మేకర్స్ ఖండించారు.

ఇటు ‘సూర్యవంశీ’, అటు ‘83’ సినిమాలను దీపావళి, క్రిస్మస్ రిలీజ్ అంటూ ప్రకటన అయితే చేశారు కానీ.. అప్పటికి థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడుస్తాయా అన్నదే సందేహం. ఎందుకైనా మంచిదని ముందు బెర్తులైతే కన్ఫమ్ చేసుకుంటున్నట్లుంది.