ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు అంత నష్టమా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నడుస్తున్న నీటి లొల్లి తెలిసిందే. తమకు హక్కుగా వచ్చే వాటిని తప్పించి.. తమకు సంబంధం లేని వాటాను వినియోగించుకోవాలన్న ఆలోచన లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

అదే సమయంలో తెలంగాణ విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం చెబుతున్న సీమఎత్తిపోతలకు సంబంధించి సీఎం కేసీఆర్ ధీమా మరోలా ఉంది. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడతామని.. ఏపీ సర్కారు ఏం చేస్తుందో తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్ర మాజీ ఇంజనీర్ల సంఘం తెర మీదకు వచ్చింది.

ఏపీ సర్కారు తాజాగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అమల్లోకి వస్తే జరిగే నష్టాన్ని వారు నివేదిక రూపంలో సీఎం కేసీఆర్ ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు.. ఏపీ సర్కారు అనుసరిస్తున్న తీరు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి? అన్న అంశానికి సంబంధించిన ప్లాన్ ఒకటి సిద్ధం చేశారు. అందులో పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి ఏమంటే?

రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర ప్రాజెక్టులతో కలిపి శ్రీశైలం నుంచి రోజుకు 17.5 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశం ఉందన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో క్రిష్ణా నదీ యాజమాన్య బోర్డు.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్.. సుప్రీంలను ఆశ్రయించాలని వారు సూచన చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కారణంగా బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు.

కల్వకుర్తి ఎత్తిపోతలను 80వరద రోజుల్లో 25 టీఎంసీలు తీసుకెళ్లేలా చేపట్టారని.. ఆయుకట్టను 2.5లక్షల నుంచి నాలుగు లక్షల ఎకరాలకు పెంచారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని నలభై టీఎంసీలకు పెంచాలన్నారు. దీనికి తగ్గట్లే మౌలికసదుపాయాలు కల్పించాలని చెప్పిన వారు పది టీఎంసీలతో రిజర్వాయర్లు నిర్మించాలన్నారు.

జూరాల పునరుజ్జీవ పథకం ప్రతిపాదనతో పాటు.. శ్రీశైలం ఎడమగట్టుకాలువ సొరంగ మార్గాన్ని వెంటనే పూర్తి చేయాలి. నెట్టెంపాడు సమీపంలో 20 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ – నల్గొండ.. రంగారెడ్డి జిల్లాల అవసరాల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రోజుకు 2.7 లేదంటే మూడు టీఎంసీల నీరు తీసుకునేలా ప్లాన్ చేయాలి. మరీ.. సూచనలకు సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.