మైత్రీ ముడుపు చెల్లించేసిన త్రివిక్రమ్

ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న వ్యవహారం ఒకటి టాలీవుడ్ లో వుంది. మైత్రీ మూవీస్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య సినిమా సంగతి అది. ఏనాడో మైత్రీ మూవీస్ రెండున్నర కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది త్రివిక్రమ్ కు. అది కూడా మహేష్ తో సినిమా చేయడానికి. కానీ తరువాత తరువాత పరిస్థితులు మారిపోయాయి.

త్రివిక్రమ్ కేవలం ఇక హారిక హాసిని బ్యానర్ లోనే సినిమాలు చేయాలని అనుకోవడంతో మైత్రీ మూవీస్ అడ్వాన్ విషయంలో తకరారు ప్రారంభమైంది. అరవింద సమేత సినిమా టైమ నుంచి ఇది నడుస్తోంది. అప్పట్లో అడ్వాన్స్, వడ్డీ కలిపి ఎనిమిది కోట్ల వరకు వెళ్లింది వ్యవహారం.

మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా మొదలు కావాల్సి వుంది. దాంతో మళ్లీ డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. 12 కోట్ల వరకు వెనక్కు ఇవ్వాలని మైత్రీ డిమాండ్. ఆఖరికి అది 11 కోట్లకు సెటిల్ అయిపోయినట్లు బోగట్టా. ఈ మేరకు త్రివిక్రమ్ పేమెంట్ కూడా చేసేసారని తెలుస్తోంది. కోటి రూపాయల దగ్గర కాస్త చర్చలు నడిచినా, మైత్రీ ఆఖరికి రాజీ పడి వదలేసినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ కు రీజనబుల్ వడ్డీ కట్టగా 11 వరకు తేలిందని, ఆ మేరకు పేమెంట్ దాదాపు జరిగిపోయిందని తెలుస్తోంది. ఇదిలా వుంటే 11 కోట్లులో ఆరు కోట్లు ఇచ్చారని, మిగిలింది ఇవ్వడానికి ఒప్పదం కుదిరింది అని ఓ వెర్షన్ వినిపిస్తోంది. కాదు, 11 కోట్లు ఇచ్చేసి సెటిల్ చేసేసుకున్నారని మరో వెర్షన్ వినిపిస్తోంది.