అమ్మకం పాతది.. తెగింపు కొత్తది

చుట్టుసమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఏం చేస్తాం ఎవరైనా? ముందు సమస్యలన్నింటి నుంచి బయటకు రావాలనుకుంటారు. అంతకు ముందు.. మరో సమస్యలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా ఎక్కువమంది అనుసరించే వ్యూహమిది.

అందరి బాటలో నడిస్తే ఆయన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అవకాశమే లేదు. సమస్యలన్నవి వస్తుంటాయి.. పోతుంటాయి. విమర్శలు చేస్తుంటారు. వేటిని పట్టించుకోకుండా తాను అనుకున్నపనిని.. అనుకున్నట్లుగా చేసుకుపోవటంలో కొత్త కోణాల్ని చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దెబ్బకు.. ప్రభుత్వాలన్ని దాని మీద ఫోకస్ పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపిస్తుంది. తెలంగాణలో పోలిస్తే.. ఏపీలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఓవైపు పాజిటివ్ కేసులు మరోవైపు.. డాక్టర్ సుధాకర్ వివాదం.. ఇంకోవైపు ఎల్ జీ పాలిమర్.. ఇవి సరిపోవన్నట్లు కోర్టు తీర్పులు.. ఇలా ఒకేసారి జగన్ ప్రభుత్వం మీద ఒత్తిళ్లు పడుతున్నా.. వాటిని పట్టించుకోకుండా మరో కొత్త వివాదానికి తెర తీసేలా ప్రభుత్వ విధానాలు ఉండటం విశేషం.

తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పలువురు తమ ఆస్తుల్ని ఇచ్చేయటం.. స్వామివారి వద్ద ఉండాలని భావించటం తెలిసిందే. ఇలాంటి ఆస్తుల్ని అమ్మాలన్న నిర్ణయం తాజా సంచలనంగా మారింది. ఇప్పుడున్న సమస్యలు సరిపోవన్నట్లు.. టీటీడీ భూముల్ని అమ్మాల్సిన అవసరం ఏమిటన్నది సగటు జీవి సందేహం. లాక్ డౌన్ తదితర కారణాలతో వచ్చిపడిన ఆర్థిక సమస్యలా? అంటే అది కూడా కాదు.

ప్రపంచంలో అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటైన తిరుమలేశుడి ఆస్తుల్ని అమ్మకాలకు పెట్టాల్సిన అవసరం ఏమిటన్న దానికి సరైన సమాధానం లభించటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలా అమ్మటం ద్వారా వచ్చే ఆదాయం రూ.1.54 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. అదే నిజమైతే.. అంతకు మించిన షాకింగ్ అంశం మరేదీ ఉండదు. ఎందుకంటే.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక రోజుకు వచ్చే హుండీ ఆదాయం కంటే తక్కువగా వచ్చే మొత్తం కోసం ఇంత పెద్దఎత్తున విమర్శల్ని మూటకట్టుకోవాల్సిన అవసరం లేదు.

మరో ఆసక్తికరమైన అంశం.. తిరుమల శ్రీవారి భూముల్ని అమ్మే వ్యవహారం కొత్తదేమీ కాదని.. 1974 నుంచి అమ్మటం జరుగుతుందంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గతంలో అమ్మినప్పుడు లేని తప్పు.. తాము అమ్మినప్పుడే వస్తుందా? అన్నది ఆయన ప్రశ్న. తామిప్పుడు అమ్మకపోతే.. ఎవరో ఒకరు ఆక్రమించుకునే ప్రమాదం ఉందని.. భూముల్ని కాపాడుకోవటం కష్టంగా ఉందని చెప్పటం చూస్తే.. ఇప్పుడైతే కాసిన్ని డబ్బులు వస్తాయి. తర్వాత అయితే అవికూడా రావన్న సందేశాన్ని ఇచ్చినట్లుంది. మొత్తంగా చూస్తే.. టీటీడీ భూములు అమ్మటం పాతదే అయినా.. జగన్ తెగింపు మాత్రం కొత్తది.