ఎట్టకేలకు ‘ఉప్పెన’ లాక్‌ అయ్యింది

మెగా కాంపౌండ్‌ నుండి హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్‌ తేజ్‌ కరోనా లాక్‌ డౌన్‌ అడ్డు రాకుండా ఉండి ఉంటే ఇప్పటి వరకు ‘ఉప్పెన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవాడు. ఏప్రిల్‌ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమాను థియేటర్లు ప్రారంభం అయిన వెంటనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైనల్‌ వర్షన్‌ ఎడిటింగ్‌లో చిరంజీవి సుకుమార్‌లతో పాటు పలువురు మెగా వర్గాల వారు పలు సూచనలు సలహాలు చేయడంతో కాస్త అటు ఇటుగా సీన్స్‌ మార్చి చివరకు రన్‌ టైంను లాక్‌ చేశారట.

అతి త్వరలోనే సినిమాను సెన్సార్‌ ముందుకు తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఉప్పెనకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ కొనసాగుతూనే ఉన్నాయని అంటున్నారు. ఉప్పెన చిత్రంలోని నీ కన్ను నీలి సముద్రం పాట సూపర్‌ హిట్‌ అయ్యింది. అందుకే సినిమాకు మంచి క్రేజ్‌ వచ్చింది. అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా మంచి బజ్‌ తో విడుదల అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఎంత వసూళ్లు చేస్తుంది అనే విషయంను ఎవరు చెప్పలేని పరిస్థితి. వచ్చే నెల లేదా ఆ తర్వాత నెలలో ప్రారంభం కాబోతున్న థియేటర్లలో ఉప్పెన ఏ స్థాయిలో ఎగసి పడుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించడంతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించడంతో అన్ని ఏరియాల్లో కూడా మంచి రేటుకు అమ్ముడు పోయింది. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే.