యంగ్ హీరో మాట‌: కోటి దాకా తీసుకుంటున్నా

ఒక హిట్టు కొడితే చాలు ఎవ్వ‌రైనా పారితోష‌కం పెంచేస్తారు. ఐతే ఏంటి రెమ్యూన‌రేష‌న్ పెంచార‌ట క‌దా అని అడిగితే మాత్రం అబ్బే అదేమీ లేదండీ అంటారు. కానీ ‘పెళ్లిచూపులు’ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. తాను పారితోష‌కం పెంచేసిన‌ట్లు అత‌ను ఓపెన్ గా చెప్పేశాడు. త‌న పారితోష‌కం కోటికి ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని కూడా అత‌ను చెప్ప‌డం విశేషం.

‘పెళ్లి చూపులు’ సినిమాతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకున్నారా అని త‌న కొత్త సినిమా ‘ద్వార‌క’ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాను క‌లిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అడిగితే.. ‘‘క్యాష్ చేసుకోవడమంటే చేసుకున్నాను. రెమ్యునరేషన్ కాస్త పెంచాను (నవ్వుతూ). ప్రస్తుతానికి కోటికి దగ్గర్లో తిరుగుతున్నాను’’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడత‌ను.

‘పెళ్లిచూపులు’ త‌ర్వాత ‘ద్వార‌క’ క‌థ మీ ద‌గ్గ‌రికి వ‌చ్చి ఉంటే ఈ సినిమా చేసేవారా అని అడిగితే.. ‘‘క‌చ్చితంగా.. ఈ కథ ‘పెళ్లి చూపులు’ తర్వాత వచ్చి ఉన్నా చేసేవాడిని. అంత బాగా నచ్చింది నాకు’’ అని విజ‌య్ అన్నాడు. ‘పెళ్లిచూపులు’ సూప‌ర్ హిట్ట‌యిన నేప‌థ్యంలో ‘ద్వార‌క’ గురించి జాగ్ర‌త్త ప‌డ్డారా.. ఏమైనా మార్పులు చేశారా అంటే.. ‘‘పెళ్లి చూపులు సినిమా విడుద‌ల‌య్యే స‌మ‌యానికే పాటలు తప్ప సినిమా చాలా వరకు పూర్తయింది. అందుకే మార్పులేమీ చేయలేదు. అయినా నేను పని చేసింది సీనియర్ టీంతో. నేను మార్పులు చెప్పేంత సీన్ లేదు’’ అని విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పాడు.