సేతుప‌తి చెప్పేశాడు.. ఆ సినిమాలో లేన‌ని #vijay sethupathi

అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం పుష్ప‌లో ఓ కీల‌క పాత్రలో త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టిస్తాడ‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌ర‌గ‌డం.. పైగా క‌రోనా వ‌చ్చి పెద్ద బ్రేక్ వేయ‌డంతో సేతుపతికి త‌ల‌నొప్పి మొద‌లైంది. అత‌డికి త‌మిళంలో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా సినిమాలున్నాయి. రెండంకెల సంఖ్య‌లో క‌మిట్మెంట్లు ఇచ్చాడ‌ట‌. క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక ఆ సినిమాల‌కు డేట్లు స‌ర్దుబాటు చేయ‌డమే త‌ల‌కు మించిన భారంగా ఉంది. ఇక బ‌ల్క్ డేట్లు అవ‌స‌ర‌మైన పుష్ప సినిమాకు ఎలా కాల్ షీట్లు కేటాయించాలో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో అత‌ను పుష్ప నుంచి త‌ప్పుకున్న‌ట్లు కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త లేక‌పోయింది. అధికార ప్ర‌క‌ట‌న ఏదీ లేదు. ఐతే ఇప్పుడు స్వ‌యంగా విజ‌య్ సేతుప‌తే ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చేశాడు. ఓ త‌మిళ మీడియా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పుష్ప సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ సినిమా కోసం త‌న‌ను అడ‌గ‌డం, పాత్ర న‌చ్చి అంగీకారం తెల‌ప‌డం నిజ‌మే అని.. కానీ ఇప్పుడు డేట్ల స‌మ‌స్య త‌లెత్త‌డంతో ఈ చిత్రం నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేద‌ని అత‌ను తెలిపాడు. ఇప్పుడు హామీ ఇచ్చి.. తీరా షూటింగ్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోతే ఇబ్బంద‌ని.. కాబ‌ట్టి త‌ప్పుడు హామీలు ఇవ్వ‌లేకే ఈ సినిమా నుంచి తప్పుకున్నాన‌ని విజ‌య్ స్ప‌ష్టం చేశాడు. విజ‌య్ ఈ విష‌యంలో ముందే సంకేతాలు ఇవ్వ‌డంతో ఆ పాత్ర‌లో బాబీ సింహా లేదా అర‌వింద్ స్వామిని న‌టింప‌జేయాల‌ని సుకుమార్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.