విసారె ‘ఆ ట్వీట్‌’ ఎందుకు డిలీట్‌ చేసినట్లు.?

వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటారు. వైఎస్‌ జగన్‌ని పొగిడేందుకోసం ఒకటి రెండు ట్వీట్లేస్తే, చంద్రబాబుని విమర్శించేందుకు పదో పాతికో ట్వీట్లు వేస్తుంటారు. కామెడీ ఏంటంటే, చంద్రబాబుని విమర్శించే క్రమంలో విజయసాయిరెడ్డి వేసే ట్వీట్లు, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి నెటిజన్ల ద్వారా చీవాట్లు పడేలా చేస్తుంటాయి.

సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయానికొస్తే, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్‌ గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఇన్వెస్ట్‌ చేయనుందన్నది వైసీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనం. సదరు కథనం ప్రకారం రాష్ట్రంలో 1,750 కోట్ల పెట్టుబడుల్ని సదరు సంస్థ పెట్టబోతోందట. టోనిటో లాంబోర్గని భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ని నెలకొల్పుతారట. ప్రస్తుతానికి ఇది యోచన మాత్రమే.

నిజానికి, ఈ ప్రాజెక్టు గతంలో చంద్రబాబు హయాంలో తెరపైకొచ్చింది. దాన్ని కాస్తా, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఘనతగా విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొనడంతో, టీడీపీ శ్రేణులు.. విజయసాయిరెడ్డిని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేశాయి. ఆ ట్రోలింగ్‌ తట్టుకోలేక విజయసాయిరెడ్డి, సదరు ట్వీట్‌ని తొలగించినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా వుంటే, పోలవరం ప్రాజెక్టు విషయమై జరుగుతున్న గలాటాకి సంబంధించి విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ వేశారు. చంద్రబాబుని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించిన తీరునీ, పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలా చంద్రబాబు వాడుకున్నారని మోడీ చేసిన ఆరోపణల్నీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. ఈ ట్వీట్‌పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామన్నారు కదా.? పోలవరం ప్రాజెక్టు కట్టి తీరతాం.. అని మీసం మెలేశారుగా.. ఇప్పుడేమంటారు.?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పింది..’ అంటూ సంబంధిత కథనాల్ని జోడించి మరీ విజయసాయిరెడ్డిని కడిగి పారేస్తున్నారు నెటిజన్లు. అయినా, విసారెకి ఇలాంటివన్నీ అలవాటే. ఏదో ట్వీటేస్తారు.. ఆ ట్వీట్‌ ద్వారా అట్నుంచి పదుల సంఖ్యలో వచ్చే విమర్శల్నీ ఆయన ఎంజాయ్‌ చేస్తుంటారు. ఆయనకు అదో తుత్తి.