ఓ జగన్.! ఓ అచ్చెన్న.! ఓ నారాయణ.! ఈ కథ ఇంతేనా.?

తమ అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచన చేయడంలేదా.? ప్రభుత్వాలు చేసే పరిపాలన గురించి అస్సలు ఆలోచన చేయడంలేదా.? ఎన్నికలొస్తున్నాయ్.. వెళుతున్నాయ్.! వాళ్ళు కాకపోతే వీళ్ళు.. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు.. ఈ రాజకీయం ఎప్పుడూ ఇలాగే వుంటుందా.?

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో అరెస్టయ్యారు, జైలుకెళ్ళారు.. కొన్ని నెలలపాటు జైల్లోనే వున్నారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. ఆ కేసు క్రమంగా నీరుగారిపోయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.. కేసు విచారణ మరింత నత్తనడకన సాగుతోంది.

తప్పు చేయకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చేయొచ్చు.. తప్పు చేశాడని తేలితే శిక్ష కూడా విధించొచ్చు. కానీ, ఇవేవీ జరగడంలేదు. అప్పటి కాంగ్రెస్ సర్కారు కుట్రలో భాగంగానే వైఎస్ జగన్ అరెస్టు.. అంటారు వైసీపీ నేతలు.

మరి, ఇప్పుడు వైసీపీ చేస్తున్నదేంటి. ఈఎస్ఐ మెడికల్ స్కాం వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.. బెయిల్ మీద విడుదలయ్యారు. తాజాగా ప్రశ్నా పత్రాల లీక్ కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణను పోలీసుల అరెస్ట్ చేస్తే ఆయనకు బెయిల్ లభించింది.

ఇదా రాజకీయం.? ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది ప్రజల కోసమా.? లేదంటే, తమ రాజకీయ పైత్యాన్ని వ్యవస్థల మీద రుద్దడానికా.? అన్న దిశగా ప్రజల్లో చర్చ జరగాలి. కానీ, ఆ చర్చకు ప్రజలే సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు పంచే కరెన్సీ నోట్ల మీద ఆసక్తి తప్ప.. ఆ కరెన్సీ నోట్లకి తమ జీవితాల్ని అమ్మేసుకుంటున్నామన్నసోయ, జనంలో వుండటంలేదేమో.!