జగనన్న విద్యా కానుకపై జనసేనాని సెటైర్.!

రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకటి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగ్, షూ, సాక్స్.. లతో ఓ కిట్ ఇస్తూ ‘జగనన్న విద్యా కానుక’ అని ప్రింట్ కూడా వేశారు. ఈ పథకానికి 650 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం చెప్పుకుంది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

‘జగనన్న గారి కానుక’ అనేకంటే కూడా ‘మోదీ – జగనన్న గారి కానుక ‘ అంటే బాగుంటుంది . 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు – 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు’ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపే ఒక టేబుల్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఇందులో కేంద్రం ఎంత శాతం నిధులు ఖర్చు చేస్తోంది.. ఏం ఇస్తోంది.. అని సవివరంగా ఉన్నాయి. కేంద్రం వాటా ఎంత.. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అనే వివరాలు కూడా ఉన్నాయి. దీనిపై పవన్ కల్యాణ్ పై విధంగా స్పందించారు.

నిజానికి పవన్ కల్యాణ్ ప్రతి విషయంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతూ ఉంటారు. ఆమధ్య జగన్ ప్రభుత్వం కరోనా టెస్టులు సమర్ధవంతంగా నిర్వహిస్తోందని ఇదే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు ప్రభుత్వం కేంద్రం వాటా ఉన్న పథకానికి కేవలం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న పథకంగా ప్రచారం చేసుకోవడంపై ఆయన తనదైనశైలిలో స్పందించారు. కరోనా టెస్టులపై పవన్ వ్యాఖ్యల్ని పాజిటివ్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. జగనన్న విద్యా కానుకపై చేసిన విమర్శల్ని ఎలా తీసుకుంటుందో చూడాలి.