‘అఖిల్‌’ పాప పక్కా కమర్షియల్‌

తొలి తెలుగు సినిమా ‘అఖిల్‌’తో నిరాశపర్చిన బ్యూటీ సయ్యేషా (సయేషా సెహగల్‌ కాస్తా సయ్యేషాగా మారిందండోయ్‌), అటు బాలీవుడ్‌లోనూ, ఇటు కోలీవుడ్‌లోనూ తొలి సినిమాలతో షాక్‌లే ఎదుర్కొంది. అయితేనేం, తెలుగుతోపాటు తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లోనూ సయ్యేషాకి మంచి ‘ఎలివేషన్‌’ లభించింది. కారణం, ఆయా సినిమాలకు ఆయా సినీ పరిశ్రమల్లో ఏర్పడ్డ హైప్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

ఇక, అసలు విషయానికొస్తే ‘అఖిల్‌’ పాప సయ్యేషా పక్కా కమర్షియల్‌ అట. కమర్షియల్‌ సినిమాల్నే ఇష్టపడుతుందట. ఓ హీరో వంద మందిని ఒంటిచేత్తో తెరపై కొట్టేస్తోంటే, క్లాప్స్‌ కొట్టడం తనకిష్టమంటోంది సయ్యేషా. కమర్షియల్‌ సినిమాలకు రీచ్‌ ఎక్కువ వుంటుందనీ, కమర్షియల్‌ సినిమాల్లోనూ నటనతో సత్తా చాటొచ్చనీ అభిప్రాయపడిందీ భామ.

”తెలుగులోనూ, తమిళంలోనూ, హిందీలోనూ తొలి సినిమాలతో సక్సెస్‌ పరంగా నిరాశ చెందాను. అయినాసరే, ఆ సినిమాలు నాకెప్పుడూ వెరీ వెరీ స్పెషల్‌. తెలుగులో ‘అఖిల్‌’ సినిమాలో నటించిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే హిందీలో నటించిన ‘శివాయ్‌’ కూడా. ‘వనమగన్‌’ తమిళంలో ఆడకపోవడానికి కారణం అప్పట్లో జరిగిన స్ట్రైక్‌ మాత్రమే..’ అంటూ సయ్యేషా తన తొలి వైఫల్యాల గురించి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తమిళంలో ఏకంగా మూడు సినిమాలతో బిజీగా వుంది సయ్యేషా. ఆర్యతో ఓ సినిమా, కార్తీతో మరో సినిమా, విజయ్‌ సేతుపతితో ఓ సినిమాలోనూ నటిస్తోందీ భామ.