అఖిల్ నెక్స్ట్.. అసలు ఏం జరుగుతోంది?

అక్కినేని యువ హీరో అఖిల్ చివరిగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. యూవీ క్రియేషన్స్ లో పీరియాడిక్ జోనర్ మూవీ ధీర కోసం అఖిల్ సిద్ధం అవుతున్నాడనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో వారియర్ గా అఖిల్ కనిపిస్తాడని ప్రచారం నడిచింది.

ఈ క్యారెక్టర్ కోసం ఫుల్ గా గెడ్డం కూడా పెంచాడు. అయితే ఎందుకనో ఈ సినిమాకి సంబందించిన ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ కంగువా సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తున్నారు. ఈ సినిమాలని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ కారణంగానే అఖిల్ తో అనుకుంటున్న ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందనే మాట వినిపిస్తోంది. అలాగే స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేయడానికి సమయం పడుతుందంట. ఈ సినిమా కోసమే అఖిల్ గెడ్డం పెంచాడు.

ఇదిలా ఉంటే వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీకృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక కథ చెప్పాడంట. ఈ స్టోరీ నాగార్జున, అమల, సుప్రియకి బాగా నచ్చిందంట. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారని టాక్. లెనిన్ టైటిల్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందంట. అయితే ఇప్పుడు ఈ సినిమాని కంప్లీట్ చేయాలనే నిర్ణయానికి అఖిల్ వచ్చారంట.

అలా అయితే ఇన్ని రోజులు ధీర సినిమా కోసం అఖిల్ పెంచిన గెడ్డం పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒక వేళ లెనిన్ సినిమాలోని క్యారెక్టర్ ని గెడ్డంతో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదంటే కొత్త లుక్ ని ట్రై చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అఖిల్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అక్కినేని ఫ్యాన్స్ కూడా అఖిల్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఓ వైపు అక్కినేని నాగార్జున కుభేర, కూలీ లాంటి పాన్ ఇండియా సినిమాలలో భాగం అవుతూ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. నాగ చైతన్య తండేల్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక అఖిల్ కూడా పాన్ ఇండియా సినిమాతో ఈ సారి పవర్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.