అభిమాన హీరోని రాముల‌మ్మ మిస్ చేసుకుంటుందా?

మెగాస్టార్ చిరంజీవి-విజ‌య‌శాంతి కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన జోడీ అది. తెర‌పై ఆ జోడీ క‌నిపిస్తే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉండేది. అయితే ‘మెకానిక్ అల్లుడు’ త‌ర్వాత మ‌ళ్లీ ఆ కాంబో సెట్ అవ్వ‌లేదు. ఆ త‌ర్వాత వారి ప్ర‌యాణాల గురించి తెలిసిందే. కాల క్ర‌మంలో ఇద్ద‌రు రాజ‌కీయాల్లో బిజీ అవ్వ‌డం…. అక్క‌డ ప్ర‌త్య‌ర్దులుగా మార‌డం..రాజకీయ విమ‌ర్శ‌లు ఇలా ఎన్నో న‌డిచాయి. అయితే మ‌ళ్లీ ఆ ఇద్ద‌రు ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ వేదిక‌పై క‌నిపించారు.

ఆ స‌మ‌యంలో ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. మాట్లాడుకున్నారు? ఎప్ప‌టికీ మీరే నాహీరో అంటూ విజ‌యశాంతి ఎంతో అభిమానంతో చిరంజీవిని ఉద్దేశించి మాట్ల‌డ‌టం జ‌రిగింది. అయితే చాలా కాలానికి మ‌ళ్లీ ఆ కాంబినేష‌న్ ని క‌ల‌పాల‌ని ‘విశ్వంభ‌ర’ ద‌ర్శ‌కుడు వ‌షిష్ట గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్న‌ట్లు తెర‌పైకి వ‌స్తోంది. ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా విశ్వంభ‌ర తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో త్రిష హీరోయిన్ గా న‌టిస్తోంది.

తాజాగా సినిమాలో కీల‌క పాత్ర‌కు విజ‌యశాంతితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌స్తోంది. పాత్ర న‌చ్చ‌డంతో ఆమె ఒకే చెప్పిన‌ట్లు ఓవైపు ప్ర‌చారం సాగుతుంది. అయితే విజ‌య‌శాంతి న‌టించ‌డానికి ఒప్పుకున్నారా? లేదా? అన్న‌ది అతి పెద్ద సందేహ‌మే. ఎందుకంటే రాముల‌మ్మ సినిమాలు వ‌దిలేసి చాలా కాల‌మ‌వుతోంది. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ లో న‌టించినా ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ప‌ట్టుబ‌ట్ట‌డంతో న‌టించారు త‌ప్ప అంత‌కు మించి కంబ్యాక్ అవ్వాల‌న్న ఉద్దేశంతో కాద‌ని ఆనాడే చెప్పారు.

ఇదే చివ‌రి సినిమా అని మ‌ళ్లీ సినిమాలు చేయ‌న‌ని కూడా క‌రాఖండీగా చెప్పేసారు. మ‌రి ఆ నాడు అలా చెప్పిన రాముల‌మ్మ చిరు కోసం మ‌ళ్లీ ఇప్పుడు ఎస్ చెబుతుందా? అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం ఆమె రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబ‌ట్టి అటువైపు దృష్టి పెట్టే అవ‌కాశాలుంటాయి గానీ సినిమా చేసే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. మ‌రి అలా కాద‌ని రాముల‌మ్మ మెచ్చిన హీరో కోసం..ఆయ‌న మాట కోసం మ్యాక‌ప్ వేసుకుంటుందా? అన్న‌ది చూడాలి.