వెండితెర మీద వెలిగిపోయే తారాల్ని చూసి.. వారిదెంత హ్యాపీ లైఫో అన్నట్లుగా చాలామంది ఫీలవుతుంటారు. అయితే.. వారు కూడా మిగిలిన వారి మాదిరి మనుషులేనని.. వారికి కుటుంబాలు.. భావోద్వేగాలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోతుంటారు. చాలామంది ఓపెన్ కారు కానీ.. కొందరు మాత్రం అందుకు భిన్నంగా తమలోని గ్లామర్ కోణానికి భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంటారు.
తాజాగా అలాంటి విషయాన్నే చెప్పి షాకిచ్చారు అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే. తొలి చిత్రంతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాల్ని షేర్ చేసుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా షూట్తో తాను నరకయాతన అనుభవించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం కోలీవుడ్లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఆమె.. తన సినిమా ఎంట్రీకి తన పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదన్నారు.
ఇంట్లో వారి మాట కాదని మరీ తాను సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఐటీ కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పినా.. థియేటర్ ఆర్ట్ మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పారు. సినిమాల్లో యాక్ట్ చేయటాన్ని తన తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకించారన్నారు.
తాను సినిమాల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు శాపనార్థాలు పెట్టారన్నారు. ముంబయిలో ఒంటరి అబ్బాయిలు అయినా.. సింగిల్ గా ఉండే అమ్మాయిలకైనా ఇళ్లు అద్దెకు ఇవ్వరని చెప్పింది. తాను మరో అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలు ఉంటున్న ఇంట్లో అద్దెకు ఉన్నట్లు చెప్పారు. వారెప్పుడూ తనతో తప్పుగా వ్యవహరించలేదని పేర్కొంది. వారి దగ్గర తాను కొత్త లోకాన్ని చూసినట్లుగా చెప్పింది.
అర్జున్ రెడ్డి సంచలన విజయంతో ఇంట్లో వారు మళ్లీ తన దగ్గరకు వచ్చారన్నారు. తన లైఫ్ లో కాలేజీలోనూ.. సినిమాల్లోకి వచ్చిన వేళలోనూ రెండుసార్లు లవ్లో పడి ఫెయిల్ అయినట్లుగా చెప్పింది. ఈ ఫెయిల్యూర్ కారణంగా చాలా బాధపడ్డానని.. అర్జున్ రెడ్డి మూవీలో హీరోతో ఇంటిమేటెడ్ సీన్లు చేసే సమయంలో నరకయాతన అనుభవించినట్లుగా చెప్పింది. ఓపక్క నరకయాతన అనుభవిస్తూనే.. అద్భుతంగా నటించిన శాలిని టాలెంట్ అదరహో అనాల్సిందే.