ఎన్టీఆర్‌కి క్రిష్‌… ఫాన్స్‌ ఖుష్‌

బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నుంచి దర్శకుడు తేజ వైదొలగడంతో ఆ ప్రాజెక్ట్‌కి కాస్త కళ తగ్గింది. అయితే ఈ చిత్రాన్ని హ్యాండిల్‌ చేయడానికి తేజ రైట్‌ ఆప్షన్‌ కాదనే అభిప్రాయం మొదట్నుంచీ వ్యక్తమయింది. తేజ వెళ్లిపోయిన తర్వాత ఈ చిత్రాన్ని ఎవరు టేకప్‌ చేస్తారనేది ఆసక్తికరమైన నేపథ్యంలో ఎవరైనా వయసు మళ్లిన దర్శకుడి చేతిలోనో, లేక పెద్దగా పేరు లేని వారికో బాధ్యతలు అప్పగించేస్తారేమోనని అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

కానీ సావిత్రి జీవిత కథతో తీసిన ‘మహానటి’ సాధించిన ఘన విజయం, అందుకున్న ప్రశంసలతో ‘ఎన్టీఆర్‌’ ప్రాజెక్ట్‌ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి మరపురాని చిత్రాన్ని బాలయ్యకి ఇచ్చిన క్రిష్‌ ఈ చిత్రం హ్యాండిల్‌ చేయడానికి సమర్ధుడని అతడినే సంప్రదించారు. ఝాన్సీ లక్ష్మిభాయ్‌ కథని తెరకెక్కిస్తున్న క్రిష్‌ దాని తర్వాత మరో బృహత్తర చిత్రాన్ని టేకప్‌ చేయడానికి అంగీకరించాడు.

క్రిష్‌ రాకతో నందమూరి అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖచ్చితంగా ఎన్టీఆర్‌ కథని జనరంజకంగానే కాకుండా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా అతను చెప్తాడని బాలకృష్ణ మాత్రమే కాకుండా అభిమానులు సైతం బలంగా నమ్ముతున్నారు.