ఒక్క ప్రాజెక్ట్ కోసం ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలు

ఇండియన్ సినీ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కారం అవ్వబోతుంది. జాతీయ అవార్డు దక్కించుకున్న ఆరుగురు దిగ్గజాలు ఒక వెబ్ సిరీస్ కోసం ఏకం అవ్వబోతున్నారు.

ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటికి నిలిచి పోయే విధంగా ఉంటుంది అనేలా రూపొందించబోతున్నారట.

ప్రియదర్శన్.. వివేక్ రంజన్ అగ్ని హోత్రి.. డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది.. జాన్ మెథ్యూ మథన్.. మజు బోహరా.. సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ లు దర్శకులుగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి మరియు హితేష్ ఠక్కర్ లు ఈ సిరీస్ ను నిర్మించబోతున్నారు.

‘వన్ నేషన్’ అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ వెబ్ సిరీస్ లో నూరేళ్ల భారతావణిలో తమ జీవితాలను దేశానికి అంకితం చేసిన గొప్ప రియల్ హీరోలను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. దేశంకు చెందిన రియల్ హీరోల కథలను ఈ జాతీయ అవార్డు గ్రహీతలు చెప్పబోతున్నారు.

దేశానికి చెందిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల యొక్క జీవితాలను మరియు స్వాతంత్య్రం అనంతరం దేశం కోసం జీవితాలను అంకితం చేసిన వారి జీవితాలను ఈ వెబ్ సిరీస్ లో పలు ఎపిసోడ్స్ గా చూపించబోతున్నారు.

ఈ సిరీస్ భారత చరిత్రలో నిలిచి పోయేదిగా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు వెళ్లడి అవ్వాల్సి ఉంది.