గీతా ఆర్ట్స్ వారి మలయాళ రీమేక్ లో అంజలి..?

మలయాళంలో సూపర్ హిట్ అయిన అనేక చిత్రాలను ఈ మధ్య తెలుగులోకి రీమేక్ చేశారు.. చేస్తున్నారు. చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు చాలామంది మలయాళ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2021 మార్చిలో విడుదలైన సక్సెస్ ఫుల్ ”నాయాట్టు” చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

కుంచాకో బోబన్ – జోజు జార్జ్ – నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నాయట్టు’ (తెలుగులో ‘వేట’) చిత్రానికి మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు తమిళ హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

‘నాయాట్టు’ హిందీ రీమేక్ రైట్స్ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సొంతం చేసుకోగా.. తమిళ హక్కులను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దక్కించుకున్నారని తెలుస్తోంది. అలానే తెలుగు రీమేక్ హక్కులు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ వారు తీసుకున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు అప్పుడే నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా మొదలైందని అంటున్నారు.

మలయాళంలో నిమిషా సజయన్ పోషించిన కానిస్టేబుల్ పాత్రకు నేచురల్ బ్యూటీ తెలుగమ్మాయి అంజలి ని ఫైనలైజ్ చేసారట. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం రావు రమేష్ ని తీసుకున్నారని అనుకుంటున్నారు. కుంచాకో బోబన్ పాత్ర కోసం సత్యదేవ్ ని సంప్రదిస్తున్నారని టాక్. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్న మేకర్స్.. అంత ఫాస్ట్ గా సినిమాని పూర్తి చేసే డైరెక్టర్ కోసం వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ను ఎవరి చేతిలో పెడతారో చూడాలి.

కాగా ‘నాయట్టు’ చిత్రంలో పొలిటీషియన్స్ తమ స్వార్ధ రాజకీయాల కోసం ఎలాంటి పనులు చేస్తారు.. వ్యవస్థలను అధికారాన్ని చేతిలో పెట్టుకుని సామాన్యులను ఎలాంటి వేధింపులకు గురి చేస్తారు అనే అంశాలను చూపించారు. నేటి రాజకీయాలకు తగ్గట్టుగా ఉండే ఈ చిత్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి సొంత పోలీసులను ఎలా బలిపశువులను చేశారనే విషయాలను చక్కగా చూపించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.