చనిపోయిన ఆ ముగ్గురు ఇండియన్‌ 2 లో ఎలా…?

కమల్‌ హాసన్‌, శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 కి బ్యాడ్‌ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. శంకర్‌ స్థాయి సినిమా ఇది కాదు అన్నట్లుగా సోషల్‌ మీడియాలో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఫలితం విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో కనిపించిన ముగ్గురి గురించి సోషల్ మీడియాలో ప్రధాన చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో దివంగత కమెడియన్‌ వివేక్‌ ఇంకా మనోబాలా మరియు నేదుమూడి వేణు లు కనిపించారు. అయితే ఈ ముగ్గురు చనిపోయి చాలా కాలం అయ్యింది.

ఇండియన్‌ 2 సినిమా ప్రారంభించి అయిదు ఏళ్లకు పైగానే పూర్తి అయ్యింది. ఆ సమయంలో ఈ ముగ్గురు బతికే ఉన్నారు. అప్పట్లోనే వారిపై పలు సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కొన్ని సన్నివేశాలు బ్యాలెన్స్ ఉండగా వారు చనిపోయారు. వేరు వేరు సమయాల్లో చనిపోయిన వారిని సినిమా కోసం శంకర్‌ రీ క్రియేట్‌ చేశాడు.

గ్రాఫిక్స్ ను వాడుకోవడంలో శంకర్‌ మామూలోడు కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ 2 కోసం ఆ ముగ్గురుని ఏఐ ద్వారా బతికించాడు. ప్రేక్షకుల ముందు వారు కదిలాడేలా చేశాడు. శంకర్‌ సినిమా లో వారిని మళ్లీ చూడటం చాలా ఆనందంగా ఉందని వారి వారి అభిమానులు అంటున్నారు.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆ ముగ్గురి విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ ముగ్గురిని ఏఐ ద్వారా రీ క్రియేట్‌ చేయడం కోసం దర్శకుడు ఏకంగా నిర్మాతలతో రూ.12 కోట్లు ఖర్చు చేయించాడట.

ఇండియన్‌ 2 సినిమాకి సీక్వెల్‌ గా ఇండియన్‌ 3 ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది. మరి ఆ సీక్వెల్‌ లో కూడా వీళ్లు ఉంటారా అనేది చూడాలి. మళ్లీ చూపించాలి అంటే భారీ మొత్తం లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి దర్శకుడు ఆ ప్రయత్నం చేస్తాడా అనేది చూడాలి.